16ఏళ్ల బాలికను లాక్కెళ్లి ఐదుగురు రేప్, అందరూ మైనర్లే
అహ్మదాబాద్: పదహారేళ్ల వయస్సు ఉన్న ఓ బాలిక పైన ఐదుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ సంఘటన గుజరాత్ రాష్ట్రంలోని నర్మద జిల్లా కంబూడి గ్రామంలో చోటు చేసుకుంది. నిందితులు బాలురు కావడం గమనార్హం.
నిందితులు అందరు కూడా పదమూడేళ్ల నుండి పదహారేళ్ల వయస్సు ఉన్నవారు. ఓ వివాహ కార్యక్రమానికి వెళ్లి ఇంటికి తిరిగొస్తున్న బాలికను మార్గమధ్యంలో అడ్డగించారు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు.
బాలిక ఇంటికి చేరుకున్న తర్వాత జరిగిన విషయం తల్లిదండ్రులకు చెప్పింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.
తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారని, ఈ ఘటన దేడియాపాడ తాలుకాలోని కంబూది గ్రామంలో జరిగిందని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు మనోహర్ సిన్హ్ జడెజా చెప్పారు. ఐదుగురు నిందుతులను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.
బాలిక ఒంటరిగా ఉండటం చూసి వారు లాక్కెల్లి అఘాయిత్యానికి పాల్పడ్డారని చెప్పారు. కాగా, నిందితుల్లో ఓ బాలుడు ఆమెకు తెలుసు. దీంతో, ఆమె నుండి సమాచారం తీసుకున్న పోలీసులు అతనిని, అతని ద్వారా మిగతా వారిని అదుపులోకి తీసుకున్నారు. బాలికను పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.