దేశంలో 18శాతం వయోజనులకు కరోనా రెండు డోసులు పూర్తి... వెల్లడించిన కేంద్రం...
దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 58 శాతం మంది వయోజనులకు కరోనా వ్యాక్సిన్ సింగిల్ డోసు ఇచ్చినట్లు కేంద్రం స్పష్టం చేసింది. 18శాతం మందికి కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు ఇచ్చినట్లు తెలిపింది. మొత్తంగా ఇప్పటివరకూ 72 కోట్ల పైచిలుకు మందికి వ్యాక్సినేషన్ పూర్తయినట్లు వెల్లడించింది. దేశంలో ఇప్పటికీ కరోనా వైరస్ సెకండ్ వేవ్ కొనసాగుతోందని కేంద్రం పేర్కొనడం గమనార్హం.
దేశంలో ఇప్పటికీ 35 జిల్లాల్లో వీక్లీ కోవిడ్ పాజిటివిటీ రేటు 10శాతంగా నమోదవుతోందని... 30 జిల్లాల్లో 5 నుంచి 10 శాతం మధ్యలో నమోదవుతోందని కేంద్రం తెలిపింది. గడిచిన వారం రోజుల్లో దేశంలో నమోదైన కొత్త కేసుల్లో 68.59శాతం కేసులు కేరళలోనే నమోదయ్యాయని పేర్కొంది. సిక్కీం,హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతం దాద్రా నగర్ హవేలీలో 18 ఏళ్లు దాటిన అందరికీ కనీసంగా సింగిల్ డోసు పూర్తయినట్లు తెలిపింది.

దేశంలో స్కూళ్ల రీఓపెనింగ్ నేపథ్యంలో చిన్నారులకు వ్యాక్సినేషన్ తప్పనిసరి చేయాలని ఇప్పటివరకూ ఏ అధ్యయనం వెల్లడించలేదని... ఆ ప్రతిపాదనకు ఎటువంటి ఆధారాలు లేవని తెలిపింది. టీచర్లు,స్కూల్ సిబ్బంది వ్యాక్సిన్లు వేయించుకున్నారని పేర్కొంది.
ఇక కరోనా వైరస్ నుంచి రక్షణ కల్పించడంలో వ్యాక్సిన్లు అత్యంత సమర్థంగా పనిచేస్తున్నాయని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డా.బలరాం భార్గవ వెల్లడించారు. వ్యాక్సిన్ సింగిల్ డోసు తీసుకున్నవారిలో మరణం సంభవించే ముప్పు 96.6శాతం మేర నివారించబడుతోందన్నారు. రెండు డోసులు తీసుకున్నవారిలో ఆ ముప్పు 97.5శాతం మేర నివారించబడుతోందని చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు సేకరించిన డేటాతో ఈ విషయాన్ని నిర్దారించినట్లు తెలిపారు.
కరోనా సెకండ్ వేవ్లో ఏప్రిల్-మే నెలల్లో సంభవించిన మరణాల్లో ఎక్కువమంది వ్యాక్సిన్ వేయించుకోనివారే ఉన్నారని బలరాం భార్గవ వెల్లడించారు. వ్యాక్సిన్ల పనితీరు అన్ని వయసుల వారిలో ప్రభావవంతంగా ఉందన్నారు. 18 ఏళ్ల వయసు నుంచి 60 ఏళ్లు పైబడ్డవారి వరకూ అందరిలోనూ వ్యాక్సిన్ సమర్థంగా పనిచేస్తోందన్నారు. వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నవారికి కరోనా వైరస్ నుంచి పూర్తి రక్షణ లభిస్తోందనే విషయం ఈ డేటాతో స్పష్టమైందని నీతి ఆయోగ్ సభ్యుడు,కోవిడ్ టాస్క్ ఫోర్స్ చీఫ్ డా.వీకే పాల్ స్పష్టం చేశారు.
దేశవ్యాప్తంగా గురువారం 43,263 కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో మొన్నటితో పోలిస్తే దాదాపు ఆరు వేల కేసులు పెరగడం గమనార్హం. గత 24 గంటల్లో 338 మరణాలు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రస్తుతం దేశంలో 1.19 శాత యాక్టివ్ కేసులు ఉన్నాయి.తాజా కేసులతో కలిపి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3.31 కోట్లు దాటింది. ఇప్పటివరకు భారత దేశంలో కరోనా కారణంగా 4,41, 749 మంది మరణించారు.. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 3,93,614 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. గడిచిన 24 గంటల్లో కేరళలో 30,196 కేసులు మరియు 181 మరణాలు సంభవించాయి. దేశంలో మొత్తం కరోనా కేసులలో కేరళ రాష్ట్రంలోనే అధికంగా కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 1,71,295 నమూనాలను పరీక్షించగా.. పాజిటివిటీ రేటు 17.63 శాతానికి పెరిగింది.












Click it and Unblock the Notifications