ఆ పెళ్లి వద్దు బాబూ అన్న యువతి: రూ.16 లక్షల జరిమానా
జోథ్పూర్: పాపం పుణ్యం ప్రపంచ మార్గం తెలియని వయస్సులో జరిగిన పెళ్లిని రద్దు చేయాలని అడిగినందుకు పంచాయతీ పెద్దలు 16 లక్షల రూపాయల జరిమానా విధించారు. అప్పుడెప్పుడో 11 నెలల వయస్సు గల చిన్నారిని తొమ్మిదేళ్ల బాలుడికిచ్చి వివాహం చేశారు.
అబ్బాయి కుటుంబానికి లాంఛనాలు ముట్టజెప్పారు. చిన్నారికి ఈడు వచ్చిన తర్వాత కాపురానికి పంపించాలని తీర్మానించుకున్నారు. ఆ తర్వాత పాప కుటుంబ సభ్యులు ఉపాధి కోసం పట్నానికి మకాం మార్చారు.
ఇప్పుడు ఆ పాప 19 ఏళ్ల యువతి అయింది. పేరు శాంతాదేవి మేఘవాల్. జోధ్పూర్లోని జై నారాయణ్ వ్యాస్ విశ్వవిద్యాలయంలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతోంది.
కాపురానికి రావాలంటూ ఐ మధ్య ఆమె అత్తారింటి నుంచి పిలుపు వచ్చింది. తనకు ఏమీ తెలియని వయస్సులో జరిగిన పెళ్లి తనకు ఇష్టం లేదని, కాపురానికి వెళ్లే ప్రసక్తి లేదని శాంతాదేవి తల్లిదండ్రులకు చెప్పింది. అందుకు తల్లిదండ్రులు సరేనన్నారు. వరుడి బంధువులకు ఆ విషయం చెప్పారు.
దాంతో వరుడి తల్లిదండ్రులు అగ్గిమీద గుగ్గిలమయ్యారు. కుల పంచాయతీ పెట్టించారు. శాంతాదేవి కాపురానికి రావాల్సిందేనని పంచాయతీ పెద్దలు తేల్చారు. రాని పక్షంలో రూ.16 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు ఇచ్చారు.
దాంతో శాంతాదేవి బెదిరిపోయి ఓ స్వచ్ఛంద సంస్థను ఆశ్రయించి. ఆ స్వచ్ఛంద సంస్థ సహకారంతో శుక్రవారంనాడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడింది. తనకు బాగా చదువుకుని టీచర్ కావాలని ఉందని, తన బాల్య వివాహం రద్దుకు సహకరించాలని కోరింది. ఈ వ్యవహారంపై రాజస్థాన్ హోం మంత్రి గులాబ్ చంద్ కటారియా స్పందించారు. పోలీసులకు ఫిర్యాదు చేయాలని బాలికకు సూచించారు.