ఆమెను వెంటాడి, 35 సార్లు కత్తులతో పొడిచి చంపారు
నూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో 19 ఏళ్ల యువతి ఈవ్ టీజింగ్ భూతానికి బలైంది. టీజింగ్కు వ్యతిరేకంగా పోరాడిన యువతి దారుణమైన హత్యకు గురైంది. యువతిని వెంటాడి వేధించడమే కాకుండా తమపై ఫిర్యాదు చేసిందని కక్షగట్టిన ఇద్దరు యువకులు ఆ యువతిని నడిరోడ్డుపై పరుగులు పెట్టించి కత్తి వేటుకు బలిచేశారు. దాదాపు 50 మంది చూస్తుండగా ఆ హత్య జరిగింది.
యువతి శరీరంపై అందినచోటల్లా 35 మార్లు తూట్లు పొడిచారు. నడిరోడ్డుపై జరుగుతున్న ఈ ఘోరాన్ని ఆపేందుకు ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. తనను ఆదుకోవాలని కేకలు వేసినా ఆమెను ఎవరూ పట్టించుకోలేదు. ఢిల్లీలోని ఆనంద్ పర్వత్ ప్రాంతానికి చెందిన మీనాక్షి(19)పై ఆమె ఇంటికి పొరుగునే ఉంటున్న జై ప్రకాష్(21), అతని సోదరుడు గతంలో వేధింపులకు పాల్పడ్డారు. దీనిపై ఆమె 2013లో పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ నేపథ్యంలో గురువారం రాత్రి మీనాక్షి సమీపంలోని మార్కెట్కు వెళ్లేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చింది. ఇది గమనించిన సోదరులు ఆమెను వెంబడించి, అడ్డు నిలబడి మరోసారి వేధింపులకు పాల్పడ్డారు. దీంతో మీనాక్షి వాళ్లిద్దరిపైనా తిరగబడింది. దీంతో రెచ్చిపోయిన సోదరులు తొలుత దాడికి దిగడంతో మీనాక్షి తప్పించుకునేందుకు యత్నించింది. మరింత రెచ్చిపోయిన కిరాతకులు తమ వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెపై దాడికి పాల్పడ్డారు. విచక్షణ రహితంగా ఆమెను కత్తితో పొడిచారు.
నెత్తురోడుతున్న శరీరంతో ఆర్తనాదాలు చేస్తూ పరుగెత్తిన మీనాక్షి సమీపంలోని ఓ భవనంలోకి ప్రవేశించి తనను రక్షించమని వేడుకుంది. అయితే, ఆ ఇంట్లోనివారు ఆమెను బయటకు నెట్టి తలుపులు మూసేశారు. దీంతో దుండగులు ఆమెపై మరోసారి దాడి చేసి పలుమార్లు కత్తితో పొడిచారు. దీంతో మీనాక్షి అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయింది. రంగంలోకి దిగిన పోలీసులు గంటల వ్యవధిలోనే ముష్కర సోదరులను అదుపులోకి తీసుకున్నారు.