కరోనాకు తొలి బలి- బెంగళూరులో ఒకరి మృతి: కలకలం- 26 నుంచి కోవిడ్ టెస్టులు
Covid 19 cases in India: కరోనా వైరస్ కేసుల సమస్య మళ్లీ తలెత్తింది. దేశంలో కరోనా వైరస్ యాక్టివ్ కేసులు నమోదయ్యాయి కూడా. వివిధ రాష్ట్రాల్లో ఈ కేసులు వెలుగులోకి వచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ కేసుల పెరుగుదలపై అప్రమత్తంగా ఉన్నామని వెల్లడించింది. ఎప్పటికప్పుడు ఆరా తీస్తోన్నామని పేర్కొంది.
దేశంలో కోవిడ్ పాజిటివ్ కేసుల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (NCDC), ఎమర్జెన్సీ మెడికల్ రిలీఫ్ (EMR), డిజాస్టర్ మేనేజ్మెంట్ సెల్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR), డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (DGHS)అధికారులు ఇందులో పాల్గొన్నారు.

ప్రధానంగా కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు అధికంగా నమోదైనట్లు వెల్లడించారు. ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్, పాన్ ఇండియా రెస్పిరేటరీ వైరస్ సెంటినెల్ సర్వైలెన్స్ నెట్వర్క్ ద్వారా కోవిడ్-19 సహా శ్వాసకోశ వ్యాధులపై ఎప్పటికప్పుడు ఆరా తీయడానికి, వాటిని పర్యవేక్షించడానికి దేశవ్యాప్త నెట్ వర్క్ ఉందని పేర్కొన్నారు.
ఈ కేసుల్లో ఎక్కువ భాగం తేలికపాటివేనని, వాటి తీవ్రత తక్కువ శాతంగా ఉంటోందని అధికారులు చెప్పారు. పాజిటివ్ గా తేలిన వారు డొమెస్టిక్ ఐసొలేషన్ లో ఉంటోన్నారని అన్నారు. కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుదలపై తాము అప్రమత్తంగా ఉన్నామని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి స్పష్టం చేశారు.
కొన్ని రోజులుగా సింగపూర్, హాంకాంగ్లల్లో కోవిడ్ 19 పాజిటివ్ కేసుల పెరుగుదల ఉంటోందని, ఇప్పటివరకు అందుబాటులో ఉన్న ప్రాథమిక సమాచారం ప్రకారం- ఆయా కేసుల తీవ్రత చాలావరకు స్వల్పమేనని కేంద్ర కార్యదర్శి పునరుద్ఘాటించారు. దేశంలో ప్రస్తుతం కోవిడ్ 19 పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని అన్నారు.
అదే సమయంలో దేశంలో కోవిడ్ కు తొలి మరణం నమోదైంది. బెంగళూరులో ఒకరు మృతి చెందారు. ఆయన వయస్సు 84 సంవత్సరాలు. బెంగళూరు వైట్ ఫీల్డ్ కు చెందిన ఆ వ్యక్తి శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులతో ఇటీవలే ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. చికిత్స పొందుతూ కొద్దిసేపటి కిందటే మరణించారు.
కోవిడ్ వల్ల ఆ వ్యక్తి మరణించినట్లు కర్ణాటక వైద్య మంత్రిత్వ శాఖ అధికారులు నిర్ధారించారు. కర్ణాటక వ్యాప్తంగా కొత్తగా అయిదు కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బెంగళూరు- 2, మైసూరు- 2, విజయనగర- 1 కేసు వెలుగులోకి వచ్చింది. గత 24 గంటల్లో 105 మందికి కోవిడ్ పరీక్షలను నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. దీనితో మొత్తం 38 యాక్టివ్ కేసులు రికార్డయ్యాయి.
బెళగావి జిల్లాలో కూడా కరోనా వైరస్ అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. 25 సంవత్సరాల వయస్సున్న గర్భిణి ఒకరు కోవిడ్ లక్షణాలతో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. అది- కోవిడా? కాదా అనేది ఇంకా నిర్ధారించాల్సి ఉందని, శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపించామని జిల్లా వైద్యధికారి డాక్టర్ ఈశ్వర్ గడాది చెప్పారు.
కోవిడ్ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోన్నారు. బెళగావిలోని బెంగళూరు ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ప్రత్యేకంగా 10 పడకలతో కోవిడ్ వార్డును అందుబాటులోకి తీసుకొచ్చారు. సోమవారం నుంచి క్రమం తప్పకుండా కోవిడ్ టెస్టులు నిర్వహించాలని నిర్ణయించారు.












Click it and Unblock the Notifications