భారతదేశంలో 2.55లక్షల కొత్త కరోనా కేసులు; వారంలో ఇవే కనిష్టం, భారీగా పెరిగిన మరణాలు
భారతదేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. గత కొన్ని రోజులుగా మూడు లక్షలకు పైగా నమోదవుతున్న రోజు వారి కేసులు ఇప్పుడు కాస్త తగ్గినట్లుగా కనిపిస్తోంది. కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, భారతదేశంలో గత 24 గంటల్లో 2,55,874 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. సోమవారం నాటితో పోలిస్తే 16 శాతం మేర కొత్త కేసులు క్షీణించినట్లుగా సమాచారం. 16 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఈ స్థాయిలో కేసులు బయటపడ్డాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Recommended Video

గత 24 గంటల్లో 614 మరణాలు
ఆరోగ్య మంత్రిత్వ శాఖ యొక్క డేటా ప్రకారం భారతదేశంలో గత 24 గంటల్లో 614 మరణాలు సంభవించాయి. దీంతో భారతదేశ మరణాల సంఖ్య 4,90,462 కు చేరుకుంది. రోజువారీ సానుకూలత రేటు 15.52 శాతం గా ఉండగా, వారపు సానుకూలత రేటు 17.17 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 2,67,753 మంది రోగులు కోవిడ్-19 నుండి కోలుకున్న తర్వాత, దేశవ్యాప్తంగా మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 3,70,71,898కి పెరిగింది.

రికవరీ రేటు ఇప్పుడు 93.15 శాతం
రికవరీ రేటు ఇప్పుడు 93.15 శాతానికి చేరుకుంది. ఇక దేశంలోని ఒక కర్ణాటక రాష్ట్రంలో 46 వేల కేసులు నమోదు కాగా, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ప్రస్తుతం దేశంలో కరోనా మృతుల సంఖ్యలో పెరుగుదల ఆందోళన కలిగిస్తుంది. సోమవారం ఒక్క రోజే 614 మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. ఇక కోవిడ్ మృతుల సంఖ్యలో నిన్న నమోదైన మరణాలలో 171 మరణాలు ఒక కేరళలో చోటుచేసుకున్నవే. ఈ రెండేళ్ల కాలంలో 3.97 కోట్ల మందికి వైరస్ సోకగా 4.9 లక్షల మంది మృత్యు ఒడికి చేరుకున్నారు.

22 లక్షలకు పైగా ప్రస్తుతం యాక్టివ్ కేసులు
భారతదేశంలో ఇప్పుడు యాక్టివ్ కేసులు మొత్తం ఇన్ఫెక్షన్లలో 5.62 శాతం ఉన్నాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 22,36,842గా ఉన్నాయి.దక్షిణాదిలో, వారాంతపు కర్ఫ్యూను ఎత్తివేసిన మూడు రోజుల తర్వాత, కర్ణాటకలో గత 24 గంటల్లో 46,426 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. మరోవైపు, తమిళనాడులో రోజువారీ కోవిడ్ కేసులు అంతకుముందు రోజు నమోదైన 30,580తో పోల్చితే, రాష్ట్రంలో 30,215 కొత్త ఇన్ఫెక్షన్లను నమోదు చేయడంతో స్వల్ప తగ్గుదల కనిపించింది.

మహారాష్ట్రలో 28,286 కొత్త కేసులు
మహారాష్ట్రలో 28,286 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 75,35,511కి చేరుకుంది. గత 24 గంటల్లో 36 మరణాలు నమోదు కాగా మొత్తం మరణాల సంఖ్య 1,42,151కి చేరుకున్నాయి. ముంబైలో సోమవారం 2,000 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. ఇది నగరంలో దాదాపు ఒక నెలలో రోజువారీ కేసులలో అత్యల్ప స్పైక్గా నిలిచింది. ఢిల్లీలో 5,760 కొత్త కేసులు నమోదయ్యాయి. రోజువారీ కేసుల సంఖ్య నిన్నటి సంఖ్య (9,197)తో పోలిస్తే 37 శాతం తగ్గింది.

162.92 కోట్ల మోతాదును దాటిన కోవిడ్-19 టీకా కవరేజీ
భారతదేశం యొక్క కోవిడ్-19 టీకా కవరేజీ 162.92 కోట్ల మోతాదును దాటింది. భారతదేశంలోని వయోజన జనాభాలో కనీసం 72 శాతం మంది పూర్తిగా టీకాలు వేయబడ్డారు. అయితే 15-18 సంవత్సరాల వయస్సు గల పిల్లలలో కనీసం 52 శాతం మంది వారి మొదటి మోతాదుతో టీకాలు వేయబడ్డారు. అయితే, 15 ఏళ్లలోపు పిల్లలకు వ్యాక్సిన్లు అందుబాటులో లేనందున, రేపటి రిపబ్లిక్ డే పరేడ్కు ఆ వయస్సు వారికి నిషేధం విధించబడింది.

కోవిడ్ పరిస్థితిపై కేంద్ర ఆరోగ్య శాఖామంత్రి రాష్ట్రాల ఆరోగ్య మంత్రులతో సమీక్ష
ప్రస్తుతం ఉన్న కోవిడ్-19 పరిస్థితుల మధ్య, గణతంత్ర దినోత్సవం రోజున రాష్ట్రపతి భవన్లో జరిగే సాంప్రదాయ ఎట్ హోమ్ వేడుక ఈ సంవత్సరం రద్దు చేయబడింది. పలువురు మంత్రులు, అధికారులకు , ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు కూడా వైరస్ సోకడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా మంగళవారం తొమ్మిది రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల ఆరోగ్య మంత్రులతో కోవిడ్-19 సమీక్ష సమావేశాన్ని నిర్వహించనున్నట్లు సమాచారం. రాష్ట్రంలో పరిస్థితులు తెలుసుకుని, తదనుగుణంగా తీసుకోవలసిన చర్యలపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ సూచనలు చేయనున్నట్టు సమాచారం.












Click it and Unblock the Notifications