జయలలిత సభలో విషాదం: ఇద్దరు మృతి
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడియంకె అధినేత్రి జయలలిత ఎన్నికల ప్రచారం సందర్భంగా విషాదం చోటు చేసుకుంది. వడదెబ్బకు ఒకరు మరణిస్తే, తొక్కిసలాటలో మరోకరు ప్రాణాలు కోల్పోయారు. సేలంలో ముఖ్యమంత్రి జయలలిత బహిరంగ సభలో పాల్గొనడానికి ఈ ఇద్దరు అన్నాడియంకె కార్యకర్తలు వచ్చారు.
అన్నాడీఎంకే కార్యకర్త ఒకతను వడదెబ్బకు స్పృహ కోల్పోవడంతో హుటాహుటిన అతన్ని ఆస్పత్రికి తరలించారు. అయినా ఫలితం దక్కలేదు. ఇదే సభలో పాల్గొనేందుకు వచ్చిన మరో అన్నాడీఎంకే కార్యకర్త తొక్కిసలాటలో మరణించాడు.
నువ్వా నేనా: తమిళనాడు సీఎం రేసుగుర్రాలు
జయ సభకు భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు తరలి వచ్చారు. ఎండ వేడికి తట్టుకోలేక కొందరు ముందుకు వచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాటలో ఓ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. మృతులను పిచయన్నన్ (55), పెరియస్వామి (62)లుగా గుర్తించారు.
అసహజ మరణాలంటూ తమకు ఏ విధమైన ఫిర్యాదులు కూడా రాలేదని పోలీసు అధికారులు చెప్పారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తమిళనాడులో ఉష్టోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటింది.
మృతులకు జయలలిత సంతాపం ప్రకటించారు. అయితే, ఎండలో ఎన్నికల ప్రచార సభ నిర్వహించడంపై డిఎంకె నేత స్టాలిన్ మండిపడ్డారు. సాయంత్రం వేళల్లో చాపర్ ఎగరలేదు కాబట్టి ఎండలో జయలలిత సమావేశాలు నిర్వహిస్తున్నారని ఆయన అన్నారు.
సోమవారంనాడు కూడా కడలూరు జిల్లాలోని విరుదాచలంలో జయలలిత నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో కూడా ఇద్దరు మరణించారు. సాధారణంగా ఎన్నికల ప్రచార సభలో సాయంత్రం వేళల్లో జరుగుతుంటాయి. కానీ జయలలిత 12 గంటల లోపల నిర్వహిస్తున్నారు.