అలా బీజేపీకి మద్దతు..ఇలా కేసు క్లోజ్: రూ. 72 వేల కోట్ల స్కామ్ లో అజిత్ పవార్ కు క్లీన్ చిట్
ముంబై: రాజకీయాలంటే ఇంతేనేమో!. మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి భారతీయ జనతా పార్టీకి సహకరిచింన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీలిక వర్గం నాయకుడు అజిత్ పవార్ మీద నమోదైన వేల కోట్ల రూపాయల కుంభకోణానికి సంబంధించిన కేసు క్లోజ్ అయింది. బీజేపీతో చేతులు కలిపిన 48 గంటల వ్యవధిలోనే ఈ కేసు కథ కంచికి చేరడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.
క్యాడర్ లో అయోమయం సృష్టిస్తోన్న అజిత్: బీజేపీతో పొత్తు అసాధ్యం: శివసేన-కాంగ్రెస్ తోనే..: శరద్ పవార్
72 వేల కోట్ల రూపాయల స్కామ్
ఈ కుంభకోణం అల్లాటప్పాదేమీ కాదు. 72 వేల కోట్ల రూపాయల విలువ చేసే కుంభకోణం అది. విదర్భ నీటి పారుదల ప్రాజెక్టు నిర్మాణంలో అజిత్ పవార్ అవినీతికి పాల్పడినట్లు సాక్ష్యాధారాలతో సహా వెల్లడైన ఉదంతం అది. మహారాష్ట్ర జల వనరుల మంత్రిత్వ శాఖ చీఫ్ ఇంజినీర్ విజయ్ పంధారే దీన్ని మొదటిసారిగా వెలుగులోకి తీసుకొచ్చారు. 1999 నుంచి 2009 మధ్య కాలంలో జల వనరుల మంత్రిగా పని చేసిన అజిత్ పవార్ ఈ కుంభకోణానికి తెర తీశారంటూ సాక్ష్యాధారాలతో సహా నాటి గవర్నర్, ముఖ్యమంత్రికి ఆయన లేఖ రాశారు.
తరచూ కరువు బారిన పడే విదర్భ ప్రాంతంలో 38 చిన్న, మధ్య తరహా నీటి పారుదల ప్రాజెక్టులను నిర్మించడానికి కేటాయించిన నిధుల్లో అజిత్ పవార్ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారనేది ప్రధాన ఆరోపణ. ఈ ఆరోపణలు అప్పట్లో మహారాష్ట్రలో పెను సంచలనాలను సృష్టించింది. రాజకీయ దుమారానికి దారి తీసింది. ఏకంగా ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ రాజీనామాను చేయాల్సి వచ్చింది. దీనిపై మహారాష్ట్ర అవినీతి నిరోధక శాఖ అధికారులు అజిత్ పవార్ పై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో ఉంది.
అజిత్ పవార్ తో జైలు తిండి తినిపిస్తామన్న బీజేపీ..
అజిత్ పవార్ పై నమోదైన విదర్భ నీటి పారుదల ప్రాజెక్టు కేసులో భారతీయ జనతా పార్టీ ఏ రేంజ్ లో ఉద్యమించిందో అందరికీ తెలిసిన విషయమే. అజిత్ పవార్ తన పదవికి రాజీనామా చేయడానికి బీజేపీ నాయకులు, వారు చేపట్టిన ఉద్యమాలే ప్రధాన కారణం. ఈ కుంభకోణానికి పాల్పడినట్లు బీజేపీ నాయకులు ఆరోపించిన సందర్భాలు చాలా ఉన్నాయి. అజిత్ పవార్ ను దోషిగా నిలబెట్టడానికి ఏకంగా రోజుల తరబడి ఉద్యమాలనే సాగించారు మహారాష్ట్ర కమలనాథులు. వారి డిమాండ్ల ఫలితంగా.. ఒకవైపు ఏసీబీ, మరోవైపు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు వేర్వేరుగా దర్యాప్తు కొనసాగించారు. ఇప్పటికీ ఆ కేసు కొనసాగుతోంది.
అలాంటి కేసులో క్లీన్ చిట్..
ఏకంగా 72 వేల కోట్ల రూపాయలకు సంబంధించిన అవినీతి కేసులో అజిత్ పవార్ కు క్లీన్ చిట్ రావడం ఆశ్చర్యానికి గురి చేస్తోందని అంటున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీకి సహకరించిన రెండంటే రెండే రోజుల్లో క్లీన్ చిట్ రావడం అనేక అనుమానాలకు తావిస్తోందని చెబుతున్నారు. ఏళ్ల తరబడి కొనసాగిన ఈ కేసును 48 గంటల వ్యవధిలో మూసి వేయడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సహకరించినందుకు.. బీజేపీ అధిష్ఠానం అజిత్ పవార్ కు ఇచ్చిన గిఫ్ట్ గా పేర్కొంటున్నారు.