తమిళనాడులో విషాదం: బోరుబావిలో రెండేళ్ల చిన్నారి.. కొనసాగుతున్న సహాయకచర్యలు
తిరుచారిపల్లి: తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. రెండేళ్ల చిన్నారి బోరుబావిలో పడిన ఘటన తిరుచిరపల్లి జిల్లాలోని నడుకట్టుపట్టిలో చోటుచేసుకుంది. శుక్రవారం సాయంత్రం సుజిత్ అనే చిన్నారి 25 అడుగుల లోతు ఉన్న బోరుబావిలో పడిపోయాడు. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ముందుగా చిన్నారి 30 మీటర్ల లోతులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆ తర్వాత కొద్ది సేపటికి చిన్నారి జారి 70 మీటర్ల లోతులో పడిపోయినట్లు అధికారులు తెలిపారు. 15 గంటల నుంచి సిబ్బంది చిన్నారిని బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. ముందుగా బోరుబావికి సమాంతరంగా మరో గొయ్యిని తీశారు. సుజిత్ను ఈ టనెల్ ద్వారా వెళ్లి రక్షిద్దామని భావించారు. అయితే గొయ్యి తీసే సమయంలో 10 అడుగులలోతులో రాళ్లు ఉండటంతో డ్రిల్లింగ్ ఆపేశారు. ఇక సహాయకచర్యలను పర్యవేక్షించేందుకు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి విజయ్ భాస్కర్, పర్యాటక శాఖ మంత్రి వల్లమండి నటరాజన్, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి వలమర్తి ఘటనా స్థలానికి చేరుకున్నారు. అధికారులు శాయశక్తుల ప్రయత్నించి చిన్నారి సుజిత్ను కాపాడాలని కోరారు.
చిన్నారి సుజిత్ను కాపాడేందుకు నిపుణుల బృందం ఘటనా స్థలానికి చేరుకుందని మంత్రి విజయ్భాస్కర్ తెలిపారు.అయితే మైక్రో కెమెరా నుంచి చిన్నారి ఊపిరి తీసుకుంటున్నట్లు గుర్తించామని మంత్రి వెల్లడించారు. లోపల చిన్నారి పరిస్థితిని సమీక్షించేందుకు 60అడుగుల లోతులోకి మైక్రోకెమెరాను పంపించినట్లు మంత్రి విజయ్భాస్కర్ చెప్పారు. శుక్రవారం సాయంత్రం 5 గంటల సమయంలో చిన్నారి సుజీత్ ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు బోరుబావిలో పడ్డాడు. గడిచిన 15 గంటలు చాలా క్రిటికల్గా మారగా తమిళనాడు ప్రభుత్వం చిన్నారిని కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం బోరుబావిలో ఉన్న చిన్నారికి వైద్యబృందం ఆక్సిజన్ సప్లయ్ను అందిస్తోంది. సహాయకచర్యలు కొనసాగుతున్నాయి.
Tamil Nadu: A 2-year-old boy, Sujith Wilson fell into a 25-feet deep borewell in Nadukattupatti, Tiruchirappalli district, yesterday. Rescue operation still underway. pic.twitter.com/MZC5V6BaTQ
— ANI (@ANI) October 25, 2019
ఇదిలా ఉంటే సేవ్ సుజీత్ అనేది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. చిన్నారి ప్రాణాలతో బయటపడాలని నెటిజెన్లు తమ ఇష్ట దైవాన్ని ప్రార్థిస్తున్నారు.