నెలలో 20 మంది రైతుల మృతి, వందలాది మందికి అస్వస్థత, ఏమైందంటే?
ముంబై: ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోకుండా పురుగుల మందులు వాడడం వల్ల మహరాష్ట్రలోని యావత్మాల్ ప్రాంతంలో నెల రోజుల వ్యవధిలోనే 20 మంది రైతులు మృత్యువాత పడ్డారు.అంతేకాదు వందలాది మంది తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
మహారాష్ట్రలోని యావత్మాల్ ప్రాంతంలో విషాదం చోటుచేసుకుంది. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండానే పురుగుల మందులు వాడడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని అధికారులు అంటున్నారు నెల రోజుల వ్యవధిలోనే 20 మంది రైతులు మృత్యువాతపడ్డారు. మరో 700 మంది ఆస్పత్రి పాలయ్యారు. వీరిలో 25మంది కంటిచూపు కోల్పోయారు.
క్రిమిసంహారక ముందులు చల్లేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలూ తీసుకోకపోవడంతో ఈ విషాదం చోటుచేసుకున్నట్లు వైద్యులు తెలిపారు. ఆగస్టు నుంచి ఇప్పటి వరకు 600 మంది క్రిమిసంహారక మందుల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మందులు చల్లేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడంతో కంటిచూపు కోల్పోవడం, తలనొప్పి, దద్దుర్లు, తల తిరగడం వంటి లక్షణాలు కన్పించడంతో వంద మందికిపైగా రైతులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ముంబయి నుంచి 670 కి.మీల దూరంలో ఉన్న యావత్మాల్ జిల్లాలో గతంలో ఎందరో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పుడు ఇదే ప్రాంతంలో క్రిమిసంహారక మందుల కారణంగా రైతులు చనిపోవడం గమనార్హం. అయితే, మందులు చల్లే పరికరాల్లో కొత్త మోడళ్లు రావడం వాటిపై రైతులకు సరైన అవగాహన లేకపోవడం కూడా ఓ కారణమేనని నిపుణులు చెబుతున్నారు.
రైతులు చనిపోతున్న విషయం జిల్లా అధికారులు ప్రభుత్వానికి వెంటనే తెలపలేదని మహారాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పాండురంగ్ ఫండ్కర్ ఆరోపించారు. దాంతో వెంటనే చర్యలు తీసుకోలేకపోయామని ఆయన చెప్పారు.
ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం చెల్లించాల్సిందిగా సూచించారు. ఈఘటనకు సంబంధించి ప్రొటెక్టివ్ గేర్లు ఇవ్వకుండా క్రిమిసంహారక మందులు విక్రయించినందుకు 'క్రిషి సేవా కేంద్ర'కి చెందిన యజమానులను అరెస్ట్ చేశారు.