ఒకే ఆస్పత్రిలో 20 మంది మృతి... ఆక్సిజన్ కొరతే కారణం... ఢిల్లీలో పిట్టల్లా రాలిపోతున్న పేషెంట్లు...
ఢిల్లీ ఆస్పత్రుల్లో మృత్యు ఘంటికలు మోగుతూనే ఉన్నాయి. నిన్నటికి నిన్న సర్ గంగారాం ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక 25 మంది కరోనా పేషెంట్లు మృతి చెందగా... తాజాగా జైపూర్ గోల్డెన్ ఆస్పత్రిలో 20 మంది కరోనా పేషెంట్లు ఆక్సిజన్ అందక మృతి చెందారు. అంతేకాదు,ప్రస్తుతం ఉన్న ఆక్సిజన్ మరో గంట మాత్రమే వస్తుందని... అది కూడా అయిపోతే 200 మంది పేషెంట్ల ప్రాణాలకు ప్రమాదమని ఆస్పత్రి సిబ్బంది వెల్లడించారు.ఢిల్లీ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత లేకుండా చూడాలని కేంద్రంపై హైకోర్టు ఘాటుగా ఫైర్ అయిన తర్వాత కూడా పరిస్థితిలో మార్పు రాకపోవడం గమనార్హం.
మూల్చంద్ ఆస్పత్రిలోనూ ఇదే పరిస్థితి...
ఢిల్లీలోని మూల్చంద్ హాస్పిటల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. తమకు అత్యవసరంగా ఆక్సిజన్ సరఫరా చేయాలని ప్రధాని నరేంద్ర మోదీకి,ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం ఉన్న ఆక్సిజన్ మరో 2గంటలు మాత్రమే వస్తుందని చెప్పింది. దాదాపు 135 మంది కరోనా పేషెంట్లు ఆక్సిజన్ సపోర్ట్పై చికిత్స తీసుకుంటున్నారని పేర్కొంది. ఆక్సిజన్ సప్లై కోసం సంబంధిత నోడల్ అధికారులను సంప్రదించే ప్రయత్నం చేసినా లాభం లేకపోయిందని వెల్లడించింది.
2) |
దారుణ పరిస్థితులు...
మూల్చంద్ ఆస్పత్రి డైరెక్టర్ మధు హందా మాట్లాడుతూ... 'ఇక కేవలం 30 నిమిషాల ఆక్సిజన్ సప్లై మాత్రమే మావద్ద మిగిలి ఉంది. తెల్లవారుజామున 4గంటల నుంచి మేము ఆక్సిజన్ సప్లై కోసం ప్రయత్నిస్తున్నాం. ఇప్పటికే నైట్ స్టాఫ్ను విధుల్లో కొనసాగిస్తున్నాం. మరింత అడిషనల్ స్టాఫ్ను కూడా పిలిచాం. వీలైనంత మంది ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాం. సకాలంలో ఆక్సిజన్ అందుతుందని ఆశిస్తున్నాం.అయితే ఇలా ఆక్సిజన్ కొరతతో ఇబ్బందులు పడే పరిస్థితి తలెత్తడం చాలా దారుణం. ఇది ఎప్పటికీ ముగిసేది కాదు... ప్రతీరోజూ జరుగుతూనే ఉంటుంది. ఇవాళ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. అందుకు నేను చింతిస్తున్నాను. అయినా సరే మనం ముందుకు సాగుతూనే ఉండాలి...' అని అభిప్రాయపడ్డారు.
నిన్న గంగారాం ఆస్పత్రిలో...
శుక్రవారం(ఏప్రిల్ 23) సర్ గంగారం ఆస్పత్రిలో కూడా ఇదే పరిస్థితి తలెత్తిన సంగతి తెలిసిందే.ఆక్సిజన్ కొరత ఏర్పడటంతో దాదాపు 25 మంది కరోనా పేషెంట్లు మృతి చెందారు.ఆస్పత్రిలో ఉన్న ఆక్సిజన్ మరో 2 గంటల్లో అయిపోతుందని... అదే జరిగితే మరో 60 మంది ప్రాణాలు ప్రమాదంలో పడుతాయని శుక్రవారం ఆస్పత్రి యాజమాన్యం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. గంగారాం ఆస్పత్రి విజ్ఞప్తిపై స్పందించిన ప్రభుత్వం వెంటనే 3 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ను ట్యాంకర్ల ద్వారా అక్కడికి తరలించింది. ఢిల్లీలోని మ్యాక్స్ ఆస్పత్రిలో కూడా ఆక్సిజన్ కొరత ఏర్పడటంతో అవసరమైన ఆక్సిజన్ను ప్రభుత్వం వెంటనే పంపించింది. అయితే ఇంతటి విపత్కర పరిస్థితుల్లో ఆక్సిజన్ సప్లై కోసం ఎదురుచూడాల్సి రావడం పేషెంట్ల ప్రాణాలకు ముప్పుగా పరిణమించిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.