ఏపీ ఎన్కౌంటర్పై తమిళనాట ఆగ్రహం: ఆంధ్రా ప్రాంతాల్లో భద్రత
చెన్నై: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శేషాచలం కొండల్లో ఎర్రచందనం స్మగర్లు, తమిళనాడు కూలీల ఎన్కౌంటర్ నేపథ్యంలో తమిళనాడులోని ఆంధ్రా వారి ఆస్తుల పైన, సంస్థల పైన దాడులు జరగవచ్చుననే అనుమానాలతో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.
ఎర్రచందనం స్మగర్లు దాదాపు ఐదు వందల మంది కూలీలను శేషాచలం కొండల్లో దించడం, దీంతో పోలీసులు కూంబింగ్ నిర్వహించగా.. స్మగర్లు, దొంగలు ఎదురు దాడికి దిగడంతో పోలీసులు కాల్పులు జరపగా, 20 మంది కూలీలు, స్మగర్లు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుల్లో తమిళనాడు కూలీలు కూడా ఉన్నారు.
దీంతో ఈ ఘటన పైన తమిళనాడు తీవ్ర నిరసన తెలుపుతోంది. తమిళనాడు ప్రభుత్వం, వివిధ తమిళ పార్టీలు ఈ ఎన్ కౌంటర్ పైన భగ్గుమంటున్నాయి. ముఖ్యమంత్రి పన్నీరుసెల్వం సమీక్ష నిర్వహించారు. ఈ ఘటనను పన్నీరు సెల్వం ఖండించారు. పలు పార్టీలు ఏపీ పోలీసుల పైన హత్య కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
తమిళనాడు ఎండీఎంకే నేత వైకో, పీఎంకే నేత రాందాస్, పీసీసీ చీఫ్ ఇళంగోవన్, బీజేపీ చీఫ్ సౌందరరాజన్ తదితరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలీసులు అరెస్టు చేసి విచారించవచ్చునని, కానీ పక్షుల్లా కాల్చి చంపడమేమిటని మండిపడుతున్నారు. కాగా, తమిళుల ఆగ్రహం నేపథ్యంలో ఆంధ్రా ప్రజలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది. ఆంధ్రా కేఫ్, టీ నగర్, పాండీ బజార్ తదితర ప్రాంతాల్లో పలు సంస్థల వద్ద భద్రతను పెంచారు.