పరీక్షలకు హాజరుకాలేక కిడ్నాప్ నాటకం
బెంగళూరు: ఓ ప్రతిష్టాత్మక కాలేజ్ లో చదువుతున్న విద్యార్థి ఇంగ్లీష్ పరీక్ష రాయలేక కిడ్నాప్ నాటకం ఆడాడు. చివరికి బెంగళూరు పోలీసులు అతనిని బెండ్ తియ్యడంతో అసలు విషయం బయటకు చెప్పాడు.
పోలీసుల కథనం మేరకు బెంగళూరు నగరంలోని క్రైస్ట్ కాలేజ్ లో జాన్ ఆంథోని (20) బీఏ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అతని తల్లిదండ్రులు ఉద్యోగరీత్యా కేరళలో నివాసం ఉంటున్నారు.
జాన్ ఆంథోని మైక్ లేఔట్ లో నివాసం ఉంటున్నాడు. ఇతనికి పీయుసీ (ఇంటర్)లో అంతంతమాత్రమే మార్కులు వచ్చాయి. అతని కుటుంబ సభ్యులు లక్షల రూపాయలు డొనేషన్లు చెల్లించి కాలేజ్ లో చేర్పించారు.
అయితే మొదటి నుంచి చదువు మీద శ్రద్ధలేని ఆంథోని ఇష్టంలేకపోయినా కాలేజ్ కు వెళుతున్నాడు. గత శుక్రవారం ఇంగ్లీషు పరీక్ష వ్రాయవలసి ఉంది. అయితే ఆంథోనికి ఇంగ్లీష్ అంతంతమాత్రమే వచ్చు. ఎలాగైనా పరిక్షలకు గైర్హాజరు కావాలని భావించాడు.

అదే రోజు ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. తరువాత తన మొబైల్ నుంచి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తనను కిడ్నాప్ చేశారని కేరళలోని తల్లికి మెసేజ్ పంపించాడు. ఆందోళన చెందిన ఆమె వెంటనే బెంగళూరులోని మైకో లేఔట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆంథోని మొబైల్ ను పోలీసులు ట్రేస్ చేశారు. ఆంథోని కదలికల మీద పోలీసులకు అనుమానం వచ్చింది. కేరళలోని తల్లి ఆంథోని బ్యాంకు ఎకౌంట్ లో నగదు డిపాజిట్ చేసింది. నగదు డిపాజిట్ అయ్యిందని మొబైల్ కు మెసేజ్ వచ్చిన వెంటనే ఆంథోని ఏటీఎం కేంద్రంలోకి వెళ్లాడు.
నగదు డిపాజిట్ చేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అతనిని ఫాలో అయ్యారు. నగదు ఖర్చు పెట్టుకుంటూ జల్సా చేస్తున్న ఆంథోనిని పోలీసులు వెంబడించారు. మళ్లీ నగదు డ్రా చేసుకోవడానికి వెళ్లిన సమయంలో పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు.
మొదట తనను సిల్వర్ కలర్ వ్యాన్ లో కిడ్నాప్ చేశారని ఆంథోని పోలీసులకు చెప్పాడు. అయితే పోలీసులు ఆంథోనికి బెండ్ తియ్యడంతో అసలు విషయం అంగీకరించాడు. తనకు చదువుకోవడం ఇష్టం లేదని, ఈ విషయం తల్లిదండ్రులకు చెబితే వారు పట్టించుకోవడం లేదని పోలీసులకు చెప్పాడు. కేరళ నుంచి వచ్చిన కుటుంబ సభ్యులకు ఆంథోనిని అప్పగించారు.












Click it and Unblock the Notifications