ఫ్రెండే.. అమ్మాయిలా నమ్మించి.. కిడ్నాప్, హత్య
ముంబై : నలుగురు ఫ్రెండ్స్ కలిసిన చోట నాలుగు సరదా మాటలు దొర్లడం.. అందులో ఓ ఫ్రెండ్ ను టార్గెట్ చేసుకుని సెటైర్లు వేయడం కామన్ గా జరుగుతూనే ఉంటుంది. అయితే ఆ సరదా సందర్బాలు.. ఆ తర్వాత ప్రాణాల మీదకు తీసుకొచ్చేలా మారడం విషాదకరం. తాజాగా ముంబైలో జరిగిన ఇలాంటి ఘటనే స్థానికంగా కలకలం రేపింది.
ముంబైలోని భయందర్ ప్రాంతానికి చెందిన విశ్వకర్మ అనే 20 ఏళ్ల యువకుడు.. అదే ప్రాంతానికి చెందిన జై ప్రజాపతికి ఏళ్లుగా స్నేహం కొనసాగుతోంది. వీరికి మరికొంతమంది ఫ్రెండ్స్ గ్యాంగ్ ఉంది. వీళ్ల సరదా ముచ్చట్లకు భయందర్ లో ఉన్న జెసాల్ పార్క్ చౌపట్టి ఓ అడ్డా. అక్కడే అందరూ కలుసుకుని ముచ్చట్లతో టైం పాస్ చేస్తుంటారు.
ఇదే క్రమంలో.. రెండు నెలల క్రితం అమ్మాయిల గురించిన ఓ చర్చను ముందేసుకున్నారు. ఇందులో మాటా మాటా పెరిగి.. విశ్వకర్మను మిగతా ఫ్రెండ్స్ ముందే చెంపదెబ్బ కొట్టాడు జై ప్రజాపతి. ఆ తర్వాత ఫ్రెండ్స్ అంతా విశ్వకర్మను ఎగతాళి చేశారు. దీంతో జై మీద విపరీతమైన కక్ష పెంచుకున్నాడు విశ్వకర్మ.
ఇందుకోసం పక్కా ప్లాన్ వేసిన విశ్వకర్మ.. నకిలీ ధ్రువ పత్రాలతో ఓ సిమ్ కార్డును సంపాదించి.. నాన్సీ అనే అమ్మాయి పేరొకటి తగిలించుకుని అమ్మాయి లాగా జై కి మెసేజ్ లు చేయడం మొదలుపెట్టాడు. అంతేకాదు అమ్మాయి గొంతును మిమిక్రీ చేస్తూ.. జై ని ప్రేమలోకి దించాడు. అసలు విషయం గుర్తించని జై కూడా తనతో మాట్లాడుతున్నది అమ్మాయేననుకుని ప్రేమలో మునిగిపోయాడు.
ఈ నేపథ్యంలోనే తన ప్రేమ గురించి విశ్వకర్మతో సహా.. మిగతా ఫ్రెండ్స్ అందరికీ చెప్పేసిన జై, నాన్సీని కలవాలని డిసైడ్ అయ్యాడు. అందుకు అటువైపు నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ రావడంతో.. విశ్వకర్మను వెంబడి పెట్టుకుని జూలై27న నాన్సీని కలిసేందుకు బయలుదేరాడు. నాన్సీ, విశ్వకర్మ ఇద్దరూ ఒక్కరేనన్న విషయం గుర్తించలేకపపోయాడు జై.
అనంతరం జై ని కిడ్నాప్ చేసిన నిందితుడు విశ్వకర్మ అతని తండ్రి నుంచి రూ.15లక్షలు డిమాండ్ చేస్తూ.. మెసేజ్ పెట్టాడు. అయితే అంతకుముందు నుంచే ఓ మ్యూజిక్ ఆల్బమ్ కోసం డబ్బులు కావాల్సిందిగా జై అతని తండ్రిని తరుచూ అడుగుతుండడంతో.. జై కావాలనే ఇలా డబ్బుల కోసం నాటకం ఆడుతున్నాడు అనుకున్నాడు తండ్రి. అయితే ఉదయాన్నే ఫ్రెండ్ ను కలవడానికి ఇంటి నుంచి బయలుదేరిన జై, రాత్రయినా ఇంటికి రావకపోవడం.. డబ్బు కావాలంటూ పదే పదే మెసేజ్ లు వస్తుండడంతో అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించారు.
నిందితుడు విశ్వకర్మ ఫోన్ ఆధారంగా పోలీసులు అతని ఆచూకీని పట్టుకోగలిగారు. అప్పటికే నిందితులు అడిగిన మొత్తం తన దగ్గర లేదని, రూ.5లక్షలు మాత్రం సర్దగలనని కిడ్నాపర్స్ తో చెప్పాడు జై తండ్రి రాజేంద్ర. అయితే పోలీసులు వాళ్లను పట్టుకునే లోపే విశ్వకర్మ అతని స్నేహితులతో కలిసి జై తలపై ఇనుపరాడ్లతో మోది చంపేశాడు.