మోడీ హత్యకు కుట్ర: ఉగ్రవాదులకు జీవిత ఖైదు
ముంబై: ఔరంగాబాద్ అక్రమ ఆయుధాల సరఫరా కేసులో మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజేషన్ క్రైమ్ యాక్ట్ (ఎంసీఓసీఏ) ప్రత్యేక కోర్టు మంగళవారం దోషులకు శిక్ష ఖరారు చేసింది. 2006లో జరిగిన ఈ కేసుకు సంబంధించి కోర్టు 12 మంది దోషులను గుర్తించింది.
దోషులలో 26/11 ముంబై దాడుల కేసులో నిందితుడు అబు జుందాల్ సహా ఏడుగురు దోషులకు న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. మరో ఇద్దరికి 14 ఏళ్లు, ముగ్గురికి 8 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
2002 గుజరాత్ అల్లర్లకు కారణమైన రాజకీయ నాయకులను టార్గెట్ చేసుకుని భారీ ఎత్తున పేలుడు పదార్థాలు, ఆయుధాలు తరలిస్తుండగా కొందరు పట్టుబడ్డారు. 2006 మే 8న వారిని అరెస్టు చేసి వారి దగ్గర 30 కేజీల ఆర్డీఎక్స్, 10 ఏకే 47 తుపాకులు, 3,200 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.
కారులో వెలుతున్న వారిలో అబు జుందాల్ అతని అనుచరులు ఉన్నారని అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు దాడి చేసిన సమయంలో అబు జుందాల్ తప్పించుకుని పారిపోయాడు.
మోడీ హత్యకు కుట్ర....... 26/11 ముంబై దాడులకు ప్లాన్
2002 అల్లర్ల తరువాత అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని, విశ్వహిందూ పరిషత్ కీలక నేతలను హత్య చెయ్యాలని అబు జుందాల్ తన సహచరులతో కలిసి ప్లాన్ వేశాడు. వారిని హత్య చెయ్యడానికి మారణాయుధాలతో వెలుతుంటే పోలీసులు దాడి చేశారు.
నిందితులపై సాక్షాధారాలు నిరూపించారు. దాడి సమయంలో తప్పించుకున్న అబు జుందాల్ బాంగ్లాదేశ్ పారిపోయాడు. అక్కడి నుంచి సౌదీ, సౌదీ నుంచి పాకిస్థాన్ వెళ్లాడు. 2008 నవంబర్ 26న లష్కర్- ఏ -తోయిబా ఉగ్రవాదులు ముంబై దాడులు చేసిన సమయంలో అబూ జుందాల్ పాకిస్తాన్ లో ఉన్నాడు.
లష్కర్- ఏ -తోయిబా చీఫ్ హఫీజ్ సయిద్ కు అబు జుందాల్ అన్ని రకాలుగా సహకరించాడని దర్యాప్తు చేస్తున్న అధికారులు ఆధారాలు సేకరించారు. 2012లో అబు జుందాల్ సినిమా ఫక్కీలో సౌదీ అరేబియాలో పోలీసులకు చిక్కిపోయాడు. నేరస్తుల అప్పగింత ఒప్పందంలో భాగంగా అబు జుందాల్ ను అరెస్టు చేసి భారత్ కు తీసుకు వచ్చారు.