మోడీ మార్క్ దెబ్బ, ఇమ్రాన్కు భారత్ జవాబు: పాక్లోకి చొచ్చుకెళ్లి మెప్పించిన ఇండియా
ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: పుల్వామా దాడి అనంతరం పక్కా ప్లాన్తో ఉగ్రవాదులకు ఊతమిస్తున్న పాకిస్తాన్కు భారత్ గట్టి షాకిచ్చింది. ఆ దేశం భూభూగంలోకి వెళ్లి మరీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఉగ్రవాద స్థావరాలను మట్టుబెట్టింది. జైష్ ఏ మహ్మద్కు అతి కీలకమైన, శిక్షణ ఇచ్చే బాలాకోట్లో స్థావరాలను నాశనం చేసింది.
సొంత భూభాగంలో ఉగ్రవాద సంస్థలకు ఊతమిస్తూ పాకిస్తాన్ భారీ మూల్యం చెల్లించుకునే పరిస్థితులు వస్తున్నాయని అంటున్నారు. గతంలో పలుమార్లు దాడులు జరిగినా భారత్ అంతర్జాతీయ సమాజంలో మాత్రమే పాక్ను ఏకాకిని చేసే ప్రయత్నాలు చేసింది. కానీ 2016లో యూరి, ఇప్పుడు పుల్వామా దాడి తర్వాత మోడీ నేతృత్వంలో దెబ్బకు దెబ్బ అని అంటున్నారు.
పాకిస్తాన్ను ఏకాకి చేసేందుకు
పుల్వామా దాడి అనంతరం భారత్.. పాక్ను ఏకాకి చేసేందుకు క్రమంగా అడుగులు వేసింది. భారత్కు ప్రపంచ దేశాలు కూడా మద్దతుగా నిలిచాయి. పుల్వామా దాడి జరిగిన కొద్ది గంటల్లోనే.. ఆ ఘటనకు తామే బాధ్యులమని జైష్ ఏ మహ్మద్ ప్రకటించింది. కాశ్మీర్లోని తమ కేడర్లో స్థైర్యం నింపేందుకు ఈ పని చేసినట్లు తెలిపింది. ఇప్పుడు అదే జైష్ సంస్థకు కీలక స్థానమైన బాలాకోట్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దాడి చేసింది. పుల్వామా దాడి జరిగినప్పటి నుంచి ప్రధాని మోడీ, ఆర్మీ వర్గాలు పదేపదే ప్రతీకారం తీర్చుకుంటామని చెబుతూనే ఉన్నాయి.
జైష్ కమాండర్ల హతం మొదలు..
ఓ పక్క అంతర్జాతీయస్థాయిలో పాక్ను ఏకాకిని చేసే ప్రయత్నాలు చేస్తూనే కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని అణగదొక్కేందుకు చర్యలు తీసుకుంది. పుల్వామా ఘటన అనంతరం పింగ్లాన్ వద్ద జైష్ కమాండర్లు కమ్రాన్, ఘాజీలను సైన్యం మట్టుబెట్టింది. తద్వారా కాశ్మీర్ లోయలో జైష్ నాయకత్వాన్ని తుడిచి పెట్టింది. కాశ్మీర్లో ఉగ్రవాదులకు అండగా ఉంటూ పాకిస్తాన్కు అనుకూలంగా ఉండే హురియత్ను ప్రభుత్వం ఏమాత్రం ఉపేక్షించకూడదని నిర్ణయించుకుంది. హురియత్ నేతలకు భద్రతను తొలగించింది.
అంతర్జాతీయ మద్దతు
పుల్వామా దాడి అనంతరం పాకిస్తాన్ అంతర్జాతీయస్థాయిలో ఏకాకిగా అయింది. పాక్కు ఎవరూ మద్దతు తెలపలేదు. చైనా కూడా అండగా నిలబడలేదు. భారత్కు మద్దతుగా న్యూజిలాండ్ చట్టసభ తీర్మానాన్ని ఆమోదించింది. అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ కూడా పుల్వామా దాడిపై పాక్ను తప్పుపట్టారు. జైష్ చీఫ్ మసూద్ అజర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని కోరుతూ తీర్మానం ప్రవేశపెడతామని న్యూజిలాండ్ ప్రకటించగా.. అమెరికా ఈ తీర్మానానికి మద్దతు తెలుపుతాని చెప్పింది.
పాక్పై మోడీ మార్క్ దెబ్బ
మరోవైపు, పాకిస్తాన్ను ఆర్థికంగా దెబ్బతీసేందుకు భారత్ చర్యలు తీసుకుంది. మోస్ట్ ఫేవర్డ్ నేషన్ హోదాను రద్దు చేసింది. పాక్ నుంచి దిగుమతి చేసుకొనే వస్తువులపై 200 శాతం సుంకం విధించింది. ఎగుమతుల్లో పాక్ వాటా కేవలం రెండు శాతం మాత్రమే ఉన్నప్పటికీ, ఇప్పటికే ఆర్థిక లోటుతో కొట్టుమిట్టాడుతున్న పాక్కు గట్టి దెబ్బ తగిలింది. భారత్ నుంచి వచ్చే దిగుమతులు తగ్గితే అక్కడ వస్త్ర పరిశ్రమ ఘోరంగా దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా, సింధు జల ఒప్పదం కింద దక్కిన వాటాను పాక్లోకి ప్రవహించకుండా చేయాలని నిర్ణయించింది. తూర్పు ప్రాంత నదుల జలాల్ని మళ్లించి, జమ్మూ కాశ్మీర్, పంజాబ్ ప్రజలకు అందించాలని నిర్ణయించింది. సింధూ జల ఒప్పందంలో భాగంగా సింధు, జీలం, చీనాబ్ నదులు పాక్కు దక్కగా, రావి, బియాస్, సట్లెజ్ నదులు భారత్కు దక్కాయి. భారత్ అన్ని విధాలుగా తమను ఇబ్బంది పెట్టడంతో పాకిస్తాన్ రెండు ఉగ్రవాద సంస్థలపై నిషేధం విధించాయి. అంతర్జాతీయ ఒత్తిడి తట్టుకోలేక బహావల్పూర్లోని జైష్ ప్రధాన కార్యాలయాన్ని పాకిస్తాన్ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు.
సాధారణ పౌరులకు ఏమీ కావొద్దని.. టార్గెట్
వైమానిక దాడులకు ముందుగా పాల్పడకూడదనే స్వయంగా పెట్టుకున్న హద్దులను భారత్ తొలిసారి అధిగమించింది. దీంతో 12 యుద్ధ విమానాలు పాకిస్థాన్ గగనతలంలోకి చొచ్చుకుపోయి ఆ దేశంలోని ఉగ్ర స్థావరాలపై దాడి చేసి సురక్షితంగా తిరిగొచ్చాయి. మా దేశంపై దాడి చేస్తే దానికి ప్రతిదాడి తప్పదంటూ రెండు రోజుల క్రితమే పాక్ ఆర్మీ హెచ్చరికలు జారీ చేసింది. ఆ హెచ్చరికలకు ఏ మాత్రం బెదరకుండా భారత్ సర్జికల్ స్ట్రైక్స్ చేసింది. దాడులకు కచ్చితమైన లక్ష్యాన్ని ఎంచుకుంది. సాధారణ పౌరులకు ఎలాంటి నష్టం కలగకుండా ఉగ్రవాదులను హతమార్చింది. ఉగ్రవాద సంస్థల ప్రధాన కార్యాలయాలు ఉన్నచోట పౌరులు ఎక్కువగా ఉంటారు. కాబట్టి శిక్షణా ప్రాంతాలను టార్గెట్ చేసింది. లక్ష్యాన్ని వంద శాతం సాధించింది.
భారత్ చేసిన దాడిని అంతర్జాతీయ సమాజం ఖండించలేదు
బాలాకోట్ జైష్ ఉగ్రస్థావరం దట్టమైన అరణ్యంలో ఉంది. ఇక్కడకు యుద్ధవిమానాలు వెళ్తే పాకిస్తాన్ రాడార్లు పట్టేస్తాయి. దానిపై దృష్టిపెట్టిన వాయుసేన టెక్నాలజీని ఉపయోగించుకుంది. రాడార్లు పని చేయకుండా ఉండేందుకు అధిక సామర్థ్యం గల జామర్లను తీసుకెళ్లింది. లేజర్ ద్వారా స్థావరాలను గుర్తించి దాడులు జరిపింది. అందుకే భారత విమానాలు సురక్షితంగా తిరిగి రాగలిగాయి. ఉగ్రవాద నిర్మూలకు భారత్ చేపట్టిన ఈ సర్జికల్ స్ట్రైక్స్ను అంతర్జాతీయ సమాజం ఖండించలేదు. దీంతో ఉగ్రవాదంపై పోరులో మనం విజయం సాధిస్తున్నామని భారత్ హర్షం వ్యక్తం చేస్తోంది.