రాజస్థాన్లో ఇసుక తుఫాను బీభత్సం, 22 మంది మృతి: ఢిల్లీలోను గాలి దుమారం
న్యూఢిల్లీ/జైపూర్: రాజస్థాన్లో ఇసుక తుఫాను బీభత్సం సృష్టించింది. రాష్ట్రంలో ఈ ధాటికి 22 మంది మృతి చెందారు. ఒక్క భరత్పూర్లోనే 11 మంది మృత్యువాత పడ్డారు. రాజస్థాన్ ఈశాన్య ప్రాంతాలను బుధవారం సాయంత్రం ఇసుక తుఫాను చుట్టేసింది. మరోవైపు ఎండలు కూడా మండిపోతున్నాయి.
విపత్తుల నిర్వహణ శాఖ తెలిపిన వివరాలప్రకారం భరత్పూర్లో పదకొండు మంది, ధోల్పూర్లో ఐదుగురు, అల్వార్లో నలుగురు, ఝన్ఝున్, బికనేర్లో ఒక్కొక్కరు మృతి చెందారు.
కరౌలీలోని ఓ భవనం గోడ కూలి ఇద్దరు మహిళలు, ముగ్గురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. పలుచోట్ల పెద్ద వృక్షాలు నేల కూలండంతో వందమందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు.
బుధవారం రాత్రి ఇసుక తుఫాను, పిడుగుల కారణంగా వేలాది విద్యుత్ స్తంభాలు నేలకూలాయని, దీంతో పలు చోట్ల చీకటి అలుముకుందని, మరమ్మత్తుకు సమయం పడుతుందని అధికారులు తెలిపారు. విపత్తు నిర్వహణ సిబ్బందిని ముఖ్యమంత్రి వసుంధరా రాజే అప్రమత్తం చేశారు.
ఇదిలా ఉండగా, ఢిల్లీలోను బుధవారం సాయంత్రం గాలి దుమారం చెలరేగింది. పలుప్రాంతాల్లో ఒక్కసారిగా చీకట్లు కమ్ముకున్నాయి. గాలి దుమారం కారణంగా పదిహేను విమానాలను దారి మళ్లించారు.