‘న ఖానేగా.. న ఖానే దుంగా’: 22మంది అవినీతి అధికారుల తొలగింపు
న్యూఢిల్లీ: కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అన్ని శాఖల్లోని అవినీతిని సమూలంగా తొలగించేందుకు నడుం బిగించినట్లు కనిపిస్తోంది. అవినీతికి పాల్పడిన ప్రభుత్వ అధికారులపై కేంద్రం ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న 22మంది సీనియర్ అధికారులపై వేటు వేసింది.
అంతేగాక, తక్షణమే వారు ఉద్యోగాలకు స్వచ్ఛంద పదవీ విరమణ చేయాలని ఆదేశించింది. అవినీతి అధికారులకు ఈ ప్రభుత్వంలో చోటు లేదని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర పరోక్ష పన్నులు, సుంకాల బోర్డు(సీబీఐసీ) 22 మంది ఉద్యోగులను తొలగించింది.
వీరంతా కూడా సూపరింటెండెంట్/ఏవో ర్యాంక్కి చెందిన అధికారులు కావడం గమనార్హం. ఫండమెంటల్ రూల్ 56(జె) ప్రకారం అధికారులను తొలగించినట్లు సీబీఐసీ పేర్కొంది.'పన్నుల విభాగంలో కొంత మంది అధికారులు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు' అని స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రధాని నరేంద్ర మోడీ తన ప్రసంగంలో ప్రస్తావించిన నేపథ్యంలో అధికారుల తొలగింపు జరగడం గమనార్హం.
Central Board of Indirect Taxes & Customs (CBIC) has compulsorily retired yet another 22 senior officers of the rank of Superintendent/AO under Fundamental Rule 56 (J) in the public interest, due to corruption and other charges. pic.twitter.com/848fScXJdG
— ANI (@ANI) August 26, 2019
అంతేగాక, మోడీ ప్రసంగాన్ని కూడా సీబీఐసీ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. వేటుపడిన వారిలో సీజీఎస్టీ నాగపూర్, భోపాల్, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, జైపూర్, కోల్కతా, మీరట్, ఛండీగఢ్ జోన్లకు చెందిన పలువురు సీనియర్ అధికారులు ఉన్నారు.
ముంబై, బెంగళూరు జోన్లకు చెందిన కస్టమ్స్ అధికారులు కూడా ఉన్నారు. మరికొంత మంది అధికారులు సీబీఐ విచారణను ఎదుర్కొంటున్నారు. వారిని కూడా సాగనంపే అవకాశం ఉంది. అవినీతి అధికారులను తొలగించడంపై సోషల్ మీడియా నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తినను.. తిననివ్వనని నరేంద్ర మోడీ అన్నట్లుగానే.. చేస్తున్నారంటూ ప్రశంసిస్తున్నారు.