కావేరి: 30 వోల్వో బస్సులు బూడిద చేసిన యువతి
బెంగళూరు: కావేరీ జలాల పంపిణి విషయంలో బెంగళూరు నగరంలో జరిగిన గొడవలు సందర్బంగా కేపీఎన్ ట్రావెల్స్ వోల్వో బస్సులు బూడిద చేసిన కేసులో ఓ యువతిని బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్టు చేశారు.
గిరినగర సమీపంలోని ధ్వారకా నగరలో నివాసం ఉంటున్న భాగ్యశ్రీ (22) అనే యువతిని శుక్రవారం రాత్రి అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు. యాదగిరికి చెందిన ఈమె బెంగళూరు చేరుకుని దినకూలీగా పని చేస్తున్నదని పోలీసులు అన్నారు.
ఈనెల 12వ తేది సోమవారం రాత్రి తాను తల్లితో కలిసి ఇంటిలో టీవీ చూస్తున్నానని, ఇంటి దగ్గర గొడవలు ఎక్కువకావడంతో వెళ్లి చూశానని, అప్పుడు అనేక మంది గుంపులు గుంపులుగా కేకలు వేస్తూ వెలుతున్నారని భాగ్యశ్రీ చెప్పిందని పోలీసులు తెలిపారు.
తాగు నీటి కోసం కన్నడిగులపై దాడి జరిగిందని అక్కడున్న వారు చెప్పడంతో తాను ఆందోళనాకారులతో కలిసి ధర్నా చెయ్యడానికి వెళ్లానని, అదే సందర్బంలో నేను కేపీఎన్ బస్సులకు నిప్పంటించానని భాగ్యశ్రీ అంగీకరించిందని పోలీసులు అన్నారు.

బస్సులకు నిప్పంటించాలని తనను ఎవ్వరూ బలవంతం చెయ్యలేదని, బస్సుకు నిప్పంటించాలని ఆవేశం రావడంతో నిప్పంటించానని భాగ్యశ్రీ చెబుతున్నదని పోలీసులు చెప్పారు. శుక్రవారం రాత్రి భాగ్యశ్రీని మడివాళలోని రిమాండ్ హోంకు తరలించామని పోలీసులు అన్నారు.
అయితే భాగ్యశ్రీ ఒక్కరే కేపీఎన్ కంపెనీ వోల్వో బస్సులకు నిప్పంటించింది అని తాము పూర్తిగా నమ్మడం లేదని పోలీసులు అంటున్నారు. సీసీ కెమెరాలను పరిశీలించిన సమయంలో ఓ మహిళ బస్సుకు నిప్పంటిస్తున్న విషయం గుర్తించి పోలీసులు గాలించారు.
పక్కా ఆధారాలు సేకరించిన తరువాతే భాగ్యశ్రీని అరెస్టు చేశామని పోలీసులు అన్నారు. తమిళనాడులోని సేలంకు చెందిన కే.పీ. నటరాజన్ కు చెందిన కేపీఎన్ ట్రావెల్స్ 30 వోల్వో, స్లీపర్ కోచ్ బస్సులు బెంగళూరులో బూడిద అయ్యాయి.
కేపీఎన్ గ్యారేజ్ సమీపంలోనే భాగ్యశ్రీ నివాసం ఉంటున్నది. ఈ కేసులో ఇంకా కొందరి ప్రమేయం ఉంటుందని పోలీసు అధికారులు అంటున్నారు. ఇప్పటికే నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ కేసు సీఐడీకి బదిలి చెయ్యాలని ప్రభుత్వం నిర్ణయించింది.
భాగ్యశ్రీకి న్యాయవాదిని పెట్టుకునే స్థోమతలేదని వెలుగు చూసింది. భాగ్యశ్రీ కేసుకు ఎలాంటి ఫీజు తీసుకోకుండా తాము వాదించడానికి సిద్దంగా ఉన్నామని బెంగళూరు న్యాయవాదుల సంఘం తెలిపింది.












Click it and Unblock the Notifications