గంటల్లో పెళ్లి, వధువును చంపిన తండ్రి: ఎందుకు?
తిరువనంతపురం: కేరళలో ఓ పరువు హత్య చోటు చేసుకుంది. వధువు కొన్ని గంటల్లో పెళ్లి పీటల మీదికి ఎక్కే స్థితి. ఆ సమయంలో తండ్రి ఆమెను చంపేశాడు. కేరళలోని మలప్పురం జిల్లా అరీకోడ్లో 22 ఏళ్ల యువతిని తండ్రి కత్తి పొడిచి దారుణంగా హత్య చేశాడు.
హతురాలిని పోలీసులు అథిరగా గుర్తించారు. ఆమె తండ్రి రాజన్ను కస్టడీలోకి తీసుకున్నారు. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని కూతురు చెప్పిన మాటలకు తండ్రి బలవంతంగా అంగీకరించాడు.
తియ్యా సామాజిక వర్గానికి చెందిన అథిర ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సైనికుడితో ప్రేమలో పడింది. అతను కొజికోడ్ జిల్లా కోయిలాండ్కు చెందినవాడు. అయితే, వారిద్దరి మధ్య ప్రేమ అథిర తండ్రికి నచ్చలేదు.
పోలీసులు జోక్యం చేసుకున్న తర్వాత కుటుంబం పెళ్లికి అంగీకరించింది. పెళ్లి శుక్రవారం జరగాల్సి ఉండింది. అంతలోనే తండ్రి ఆగ్రహానికి ఆమె బలైంది. ఆమె మంజరి వైద్య కళాశాలలో డయాలిసిస్ సెంటర్లో పనిచేస్తోంది.
తండ్రి కత్తితో పొడిచిన తర్వాత అథిరను ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆమె అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.