పంజాబ్లో 23 మంది మంత్రులు,ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్...
పంజాబ్లో ఇప్పటివరకూ 23 మంది మంత్రులు,ఎమ్మెల్యేలు కరోనా బారిన పడ్డారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ తెలిపారు. అసెంబ్లీ సమావేశాలకు (అగస్టు 28) రెండు రోజులు ముందు ఇలాంటి పరిస్థితి నెలకొనడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. కరోనా నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే మంత్రులు,ఎమ్మెల్యేలకు కరోనా నెగటివ్ సర్టిఫికెట్ను స్పీకర్ కేపీ సింగ్ తప్పనిసరిచేశారు. బుధవారం(అగస్టు 26) కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నేత్రుత్వంలో నీట్,జేఈఈలపై జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో అమరీందర్ సింగ్ ఈ వివరాలు వెల్లడించారు.
ఎమ్మెల్యేలు,మంత్రులే కరోనా బారినపడుతున్నారంటే క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చునని అమరీందర్ సింగ్ అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడం సరికాదన్నారు. దీనిపై సుప్రీం కోర్టుకు వెళ్లి పరీక్షలను వాయిదా వేయాల్సిందిగా కోరుదామని సమావేశంలో పాల్గొన్న ఇతర ముఖ్యమంత్రులను కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించడమంటే విద్యార్థుల జీవితాలను రిస్క్లోకి నెట్టడమేనని అన్నారు.
సోనియా గాంధీ నేత్రుత్వంలో జరిగిన సమావేశంలో మొత్తం ఏడుగురు ముఖ్యమంత్రులు సుప్రీంలో రివ్యూ పిటిషన్కు ఏకాభిప్రాయానికి వచ్చారు. సమాఖ్య స్పూర్తికి విఘాతం కలిగించేలా వ్యవహరించేలా కేంద్రంపై పోరాడాల్సిందేనని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే అన్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా.. విద్యార్థులు మానసిక వేదనకు గురవుతున్న ఈ తరుణంలో వారికి అండగా నిలబడుదామని అన్నారు. మరోవైపు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మాత్రం షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది. విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు.