మహారాష్ట్రలో 24వేలకుపైగా కొత్త కేసులు: 58 మరణాలు, మళ్లీ లాక్డౌన్ పరిస్థితి వద్దంటూ మంత్రి
ముంబై: మహారాష్ట్రలో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతూనే ఉంది. అయితే, గత రెండు మూడు రోజులకంటే సోమవారం కాస్త తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో 24,265 కొత్త కేసులు వెలుగుచూడగా, 58 కరోనా మరణాలు సంభవించాయి. దీంతో ఇప్పటి వరకు మహారాష్ట్రలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 25,04,327కి చేరింది.
రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 53,457కు చేరింది. గత 24 గంటల్లో 19,463 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 22,34,330కి చేరింది. రికవరీ రేటు 89.22 శాతానికి పడిపోయింది. ఇక ముంబై నగరంలో కొత్తగా 3260 కరోనా కేసులు నమోదయ్యాయి.
రాష్ట్రంలో కరోనా కేసులు పెరగడంపై మహారాష్ట్ర ఆరోగ్యమంత్రి రాజేష్ తోపే ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలంతా తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాలని కోరారు. మరోసారి లాక్డౌన్ విధించే పరిస్థితులు తీసుకురావద్దని సూచించారు.
రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే పలు కరోనా నిబంధనలను, మార్గదర్శకాలను విడుదల చేసింది. వాటిని పాటించకుండా జరిమానాలు తప్పవని స్పష్టం చేసింది.
దేశంలోకి గత సంవత్సరం కరోనా వ్యాపించిన నాటి నుంచి ఈ ఏడాది మార్చి 20 వరకు బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించని వారిపై జరిమానా విధించడం ద్వారా రూ. 44 కోట్ల మేర వసూలు చేసినట్లు బీఎంసీ అధికారులు తెలిపారు. మాస్కులు ధరించని వారి నుంచి రూ. 200 జరిమానా వసూలు చేసినట్లు తెలిపారు.