నిజమేనా: బీజేపీతో టచ్లో 25 మంది శివసేన ఎమ్మెల్యేలు..?
మహారాష్ట్ర రాజకీయాల్లో ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు డెడ్ లైన్ దగ్గరపడుతుండటంతో బేరసారాలు జరుగుతున్నట్లుగా కనిపిస్తున్నాయి. ఈ మాటలకు బలం చేకూర్చేలా బద్నేరా నియోజకవర్గం స్వతంత్ర ఎమ్మెల్యే రవి రాణా సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఎమ్మెల్యేలను శివసేన కాపాడుకుంటుందా..?
ముఖ్యమంత్రి పోస్టుపై తేల్చేవరకు మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు కాదని శివసేన పార్టీ చెబుతోంది. ఎంతసేపు శివసేన పార్టీ పదవిపైనే మాట్లాడుతోంది కానీ తమ ఎమ్మెల్యేలు తమ చేతిలోనే ఉన్నారా లేక బీజేపీ వైపునకు చూస్తున్నారనా అనేదానిపై దృష్టి సారించడం మరిచినట్లు ఉంది. తాజాగా బద్నేరా ఎమ్మెల్యే రవిరాణా సంచలన వ్యాఖ్యలు చేశారు. శివసేన పార్టీ నుంచి 25 మంది ఎమ్మెల్యేలు ఫడ్నవీస్తో టచ్లో ఉన్నట్లు చెప్పారు. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందనే ధీమా వ్యక్తం చేశారు. శివసేన బీజేపీతో కలిసి వెళ్లకుంటే ఆ పార్టీలో చీలికలు తథ్యమని జోస్యం చెప్పారు.

బీజేపీ మైండ్ గేమ్కు దిగిందా..?
బీజేపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేసింది కాబట్టే శివసేనకు 56 సీట్లు వచ్చాయని లేకుంటే ఆ పార్టీకి వచ్చిన సీట్ల సంఖ్య 25కే పరిమితం అయ్యేది అని చెప్పారు. ఇప్పటికే 25 మంది శివసేన ఎమ్మెల్యేలు దేవేంద్ర ఫడ్నవీస్తో టచ్లో ఉన్నట్లు చెప్పి పెద్ద బాంబు వేశారు రవి రాణా. ఇక ఫడ్నవీస్ సర్కార్లో వారంత చేరేందుకు సిద్ధంగా ఉన్నారని రవిరాణా చెప్పారు. రవిరాణా మాటలతో ఇప్పుడు శివసేన పార్టీలో కలవరం మొదలైంది. ఎవరా 25 మంది ఎమ్మెల్యేలు అని ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఇది మైండ్ గేమ్ అయి ఉంటుందని కూడా శివసేన అధినాయకత్వం భావిస్తోంది.

ఉద్ధవ్ థాక్రే ఎందుకు స్పందించడం లేదు..?
ఓటర్లు స్పష్టమైన మెజార్టీ ఇచ్చినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటులో శివసేన పార్టీ అడ్డంకులు సృష్టిస్తోందని దీంతో పాలన గాడి తప్పుతోందని రవి రాణా విమర్శించారు. ఇంత స్పష్టమైన మెజార్టీ ఇచ్చినప్పటికీ శిరసా వహించకపోవడమంటే మహారాష్ట్ర ప్రజలను శివసేన పార్టీ అవమానిస్తున్నట్లే అని ధ్వజమెత్తారు. పొత్తుల చర్చల సమయంలో అమిత్ షా, దేవేందర్ ఫడ్నవీస్లతో పాటు శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే ఉన్నారని ఆయనే బయటకొచ్చి మాట్లాడాలి తప్పితే ఆ పార్టీ చిలక అయిన సంజయ్ రౌత్తో మాట్లాడించడమేంటని ప్రశ్నించారు రవిరాణా.

శివసేనను చీల్చే కార్యక్రమం జరుగుతోందా..?
ఇక రవిరాణా వ్యాఖ్యలతో మహా రాజకీయాలు మరో మలుపు తీసుకున్నాయి. నిజంగానే 25 మంది శివసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు బీజేపీ వైపు మొగ్గు చూపితే శివసేన పరిస్థితి అధ్వానంగా తయారవుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటి వరకు తాము లేకుండా ప్రభుత్వం ఏర్పాటు కాదనే భావనలో ఉన్న శివసేనకు ఈ వార్త కచ్చితంగా చేదువార్తే అవుతుందని చెబుతున్నారు. మరోవైపు ఇది ఒకరకమైన మైండ్గేమ్గా కూడా చూస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇలాంటి పుకార్లు సృష్టించి శివసేన ఐక్యతను దెబ్బకొట్టాలనే ప్రయత్నం రవిరాణా చేస్తున్నారా అనే సందేహాన్ని సైతం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications