పేరుకే లాయర్లు.. ప్రాక్టీసు మాత్రం నిల్.. 260 మంది లాయర్లు డిబార్
సుప్రీంకోర్టు వెలువరించిన ఉత్తర్వుల మేరకు పెద్ద సంఖ్యలో లాయర్ల గుర్తింపును రద్దు చేస్తూ త్రిపుర బార్ కౌన్సిల్(టీబీసీ) సంచలన నిర్ణయం తీసుకుంది.
అగర్తల (త్రిపుర): పెద్ద సంఖ్యలో లాయర్ల గుర్తింపును రద్దు చేస్తూ త్రిపుర బార్ కౌన్సిల్(టీబీసీ) సంచలన నిర్ణయం తీసుకుంది. గత ఐదేళ్లు, అంతకంటే ఎక్కువ కాలంటీ వీరంతా కోర్టుల్లో ఎలాంటి న్యాయవాద వృత్తి సంబంధ కార్యకలాపాలు చేపట్టలేదని తెలిపింది.
న్యాయవాద వృత్తిలో కొనసాగని వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని 2010లో సుప్రీంకోర్టు వెలువరించిన ఉత్తర్వుల మేరకు తాము ఈ చర్యలు చేపట్టినట్లు త్రిపుర బార్ కౌన్సిల్ ఛైర్మన్ పియూష్ కాంతి బిశ్వాస్ ఒక ప్రకటనలో వెల్లడించారు.
ప్రస్తుతం డిబార్ అయిన 260 మంది న్యాయవాదులు హైకోర్టుతోపాటు రాష్ట్రంలోని వివిధ బార్ కౌన్సిళ్లలో నమోదై ఉన్నారు. ఈ మేరకు బార్ కౌన్సిల్ ఆఫ్ త్రిపుర కార్యాలయంలో వారి పేర్ల జాబితాను ఉంచింది.
పేర్ల నమోదుతో సరి, ప్రాక్టీసు ఏదీ?
ఏళ్ల క్రితమే లా డిగ్రీ పొందిన చాలామంది ప్రాక్టీస్ కోసం బార్ కౌన్సిల్ లో పేర్లను నమోదు చేసుకున్నారని, అయితే వారిలో చాలామంది వివిధ కారణాలతో ప్రాక్టీస్ చేపట్టలేదని టీబీసీ పేర్కొంది. కొందరు రాజకీయాల్లో, మరికొందరు ఇతర వృత్తుల్లో కొనసాగుతున్నట్లు పేర్కొంది.
ప్రముఖులు కూడా..
గుర్తింపు రద్దయిన న్యాయవాదుల్లో కొందరు ప్రముఖులు కూడా ఉన్నారు. వారిలో త్రిపుర అసెంబ్లీ స్పీకర్ రామేంద్ర చంద్ర దేబ్ నాథ్, తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన ఎమ్మెల్యే సుదీప్ రాయ్ బర్మన్ తోపాటు ఆయన తండ్రి, మాజీ సీఎం సమీర్ రంజన్ బర్మన్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుబాల్ భౌమిక్ తదితరులున్నారు.
తప్పుడు ధ్రువీకరణలు, నేర చరితులు...
బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సూచనల మేరకు తాము ఈ చర్య తీసుకున్నట్లు త్రిపుర బార్ కౌన్సిల్ ఛైర్మన్ పియూష్ కాంతి బిశ్వాస్ తెలిపారు. టీబీసీ సభ్యుల్లో న్యాయవాద వృత్తి చేపట్టని వారు, తప్పుడు ధ్రువీకరణలతో నమోదైన వారు, నేర చరితులు ఉన్నట్లు తమ పరిశీలనలో గుర్తించినట్లు పేర్కొన్నారు.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు...
న్యాయవాద పట్టా పొందిప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల్లో పని చేస్తున్న వారిని కూడా డిబార్ చేసినట్లు బిశ్వాస్ తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశానుసారం దేశమంతటా ఉన్న బార్ కౌన్సిళ్లు కూడా ఇదే విధమైన చర్యలు చేపడతాయని ఆ ప్రకటనలో స్పష్టం చేశారు.
తిరిగి ప్రాక్టీస్ చేయాలంటే...
ఈ మేరకు డిబార్ అయిన వారిని బార్ కౌన్సిల్ ఎన్నికల్లో పాల్గొనేందుు అనర్హులని ప్రకటించారు. డిబార్ అయిన లాయర్లు ఎవరైనా తిరిగి ప్రాక్టీస్ చేపట్టాలని భావిస్తే వారు బార్ కౌన్సిల్ కు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆ మేరకు వారి పేర్లను, వారు పని చేయదలచిన ప్రాంతం వివరాలను తెలపాల్సి ఉంటుందని, 2015 వెరిఫికేషన్ నిబంధనల ప్రకారం అంతిమ నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు.