స్కైడైవ్: ప్యారాచూట్ ఓపెన్ కాక మహిళా టెక్కీ మృతి
చెన్నై: ఇరవయ్యారేళ్ల ఓ మహిళా టెక్కీ స్కైడైవ్ సమయంలో ప్యారాచూట్ ఓపెన్ కాకపోవడంతో పదివేల అడుగుల ఎత్తు నుండి కిందపడి మృతి చెందారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రం సేలం సమీపంలోని ఓమలూర్లో జరిగింది. రమ్య అనే మహిళా టెక్కీ ఎయిర్ క్రాఫ్ట్ నుండి పదివేల అడుగుల ఎత్తు నుండి కిందకు దూకారు.
ఆరువేల అడుగుల ఎత్తుకు వచ్చినప్పుడు ప్యారాచూట్ తెరిచే ప్రయత్నం చేయగా అది తెరుచుకోలేదు. దీంతో ఇన్స్ట్రక్టర్ ఎమర్జెన్సీ ప్యారాచూట్ ఓపెన్ చేయమని చెప్పారు. అయితే అప్పటికే ఆలస్యమైంది. ఆ సమయంలో రమ్య భర్త వినోద్ ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి సేలం పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
రమ్య స్కై డైవ్ కోసం వెళ్లినప్పుడు భర్త వినోద్ తదుపరి తన వంతు కోసం నిరీక్షిస్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ జంట బెంగళూరుకు చెందినవారు. వీరు ఇండియన్ స్కై డైవింగ్ అండ్ ప్యారచూట్ అసోసియేషన్లో సభ్యులు.
వీరు అంతకుముందు జనవరి 25న మూడువేల అడుగుల స్కై డైవ్ను విజయవంతంగా పూర్తి చేశారు. దాంతో థ్రిల్గా ఫీలైన ఈ జంట గురువారం మళ్లీ పదివేల అడుగుల స్కై డైవ్ కోసం వచ్చారు. గురువారం ఉదయం రమ్య ఇద్దరు స్కై డ్రైవింగ్ శిక్షకులు మోహన్ రావు, ఐశ్వర్య యాదవ్లతో కలిసి ఎయిర్ క్రాఫ్టు లో పదివేల అడుగుల ఎత్తుకు వెళ్లారు.
ఎయిర్ క్రాఫ్ట్ పదివేల అడుగుల ఎత్తుకు వెళ్లాక జంప్ చేయమని తన భార్య రమ్యకు ఇన్స్ట్రక్టర్స్ సూచించారని భర్త వినోద్ చెప్పారు. డైవ్ చేసిన రమ్య ప్యారాచూట్ ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తే తెరుచుకోలేదని, అదే సమయంలో బాగా గాలి వీస్తుండటంతో ఆమె గాల్లోనే చక్కర్లు కొట్టారని చెప్పారు.
ఎయిర్ క్రాఫ్ట్ నుండి దూకిన రమ్య ఒక నిమిషం లోపే గ్రౌండ్ పైన పడింది. మరోవైపు తాము రమ్యకు హెడ్ ఫోన్ ద్వారా సూచనలు ఇచ్చే ప్రయత్నాలు చేశామని, ఎమర్జెన్సీ ప్యారాచూట్ ఓపెన్ చేయమని చెప్పామని కానీ, ఆమె వెంటనే స్పందించలేకపోయారని ఇన్స్ట్రక్టర్స్ చెప్పారు.