బెంగుళూర్ చర్చి స్ట్రీట్ పేలుళ్లు: ముగ్గురి అరెస్టు
బెంగళూరు: ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) అనుమానితులుగా అనుమానిస్తూ ముగ్గురిని కర్ణాటక రాజధాని బెంగళూర్ పోలీసులు అరెస్టు చేశారు. కర్ణాటకలోని పోర్ట్ టౌన్ భత్కల్లో వారిని పోలీసులు అరెస్టు చేశారు. భారీగా పేలుడు పదార్థాలు, సాక్ష్యానికి అవసరమైన ఇతర సామగ్రి కూడా పోలీసులకు చిక్కింది.
పోలీసులు భత్కల్లోనూ బెంగళూరులోనూ విస్తృతంగా సోదాలు నిర్వహించారు. సీనియర్ ఇండియన్ ముజాహిదీన్ నేతల నుంచి ఈ ముగ్గురికి మెసేజ్లు వస్తున్నట్లు బెంగళూరు పోలీసు కమిషనర్ ఎంఎన్ రెడ్డి మీడియా ప్రతినిధులకు చెప్పారు.
అయితే, బెంగళూరు చర్చి స్ట్రీట్ పేలుళ్ల కేసులో మాత్రం ఏ మాత్రం ప్రగతి లేదు. ఈ కేసుకు సంబంధించిన ఏ విధమైన సంబంధాలను కూడా వారు గుర్తించలేకపోయారు. ఈ పేలుళ్ల ఘటనలో ఓ మహిళ మరణించిన విషయం తెలిసిందే.
తాజాగా పోలీసులు స్వాధీనం చేసుకున్న సామగ్రిని పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ లాబోరేటరీకి పంపించనున్నారు. భత్కల్ ప్రాంతంలో ఉగ్రవాదులకు సంబంధించిన కొన్ని ఆనవాళ్లు ఉన్నాయని పోలీసులు అంటున్నారు.