మహిళపై గ్యాంగ్ రేప్: ఆసిడ్ పోసి ముఖం కాల్చేశారు
కాన్పూర్: ఉత్తర్ ప్రదేశ్ లో ఓ మహిళ మీద సామూహిక అత్యాచారం చేసిన నిందితులు తరువాత ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసి తమను గుర్తు పట్టకుండా చెయ్యడానికి ఆసిడ్ పోసి ముఖం కాల్చేశారు.
తరువాత ఆ మహిళను తీసుకు వెళ్లి రైల్వే ట్రాక్ మీద విసిరివేసిన ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూర్ లో జరిగింది. కాన్పూర్ ఎస్పీ షలబ్ మతూర్ కేసు వివరాలు వెల్లడించారు.
అలహాబాద్ లో నివాసం ఉంటున్న ఓ మహిళ (40)ను ముగ్గురు గుర్తు తెలియని నిందితులు ఎత్తుకు వెళ్లి సామూహిక అత్యాచారం చేశారు. తరువాత ఆమె తమను గుర్తు పట్టకుండా ఉండానికి ముఖం మీద ఆసిడ్ పోశారు.
ఆమెను తీసుకు వెళ్లి రైల్వే ట్రాక్ మీద విసిరివేసి వెళ్లారు. అటు వైపు వెలుతున్న వారు విషయం గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు.
ఆమె ముఖం పూర్తిగా కాలిపోయిందని, గొంతు కాలిపోవడంతో మాటలు రావడం లేదని, ఒక కన్ను పూర్తిగా కాలిపోయిందని ఎస్పీ షలబ్ మతూర్ చెప్పారు. ఆమె చేతులతో చేసిన సైగల వలన ముగ్గురు గ్యాంగ్ రేప్ చేశారని గుర్తించామని, నిందితుల కోసం గాలిస్తున్నామని ఎస్పీ చెప్పారు.