తుపాకీతో బెదిరించి.. ముగ్గురు అక్కాచెల్లెళ్ల కిడ్నాప్
లక్నో: తుపాకీతో బెదిరింపులకు గురిచేసి ముగ్గురు అక్కాచెల్లెళ్లను అపహరించిన ఘటన ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇండో-నేపాల్ సరిహద్దులోని ఖైరిగఢ్ గ్రామానికి చెందిన మున్నీదేవి ఇంట్లోకి శనివారం రాత్రి ఆరుగురు దుండగులు చొరబడ్డారు.
తుపాకీలతో బెదిరించి ఆమె ముగ్గురు కుమార్తెలు సంతోషి(17), రోహిణి(19), ఉపమా(22)లను కిడ్నాప్ చేశారు. దీంతో మున్నీ దేవి పోలీసులను ఆశ్రయించింది.
రూ. 50లక్షలు ఇచ్చి.. కుమార్తెలను విడిపించుకోవాలని దుండగులు డిమాండ్ చేస్తున్నట్లు మున్నీ పోలీసులకు చెప్పింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, దుండగుల కోసం గాలిస్తున్నట్లు ఏఎస్పీ ఏపి సింగ్ తెలిపారు.
యువతుల కిడ్నాప్ సమాచారాన్ని సమీపంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు తెలియజేసినట్లు చెప్పారు. డిఐజి డికె చౌదరి ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లోపించాయంటూ ఇక్కడికి చేరుకున్న బిజెపి నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.