3 ఓట్లు కూడా రావు, అనర్హత వేటు వేయండి, మిథున్ రెడ్డికి రఘురామ కృష్ణరాజు సవాల్
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఈ సారి రూటు మార్చారు. ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత మిథున్ రెడ్డి లక్ష్యంగా విమర్శలు చేశారు. కుల, మత రాజకీయాలపై తనదైన శైలిలో మండిపడ్డారు. తనపై అనర్హత వేటు వేయాలని కోరారు. చట్ట ప్రకారం తనపై అనర్హత వేటు వేయడం వల్ల కాదు అంటూనే.. మిథున్, పార్టీ లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేశారు. మంగళవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.

మిథున్ వర్సెస్ రఘురామ..
పార్లమెంటరీ నేత మిథున్ రెడ్డి లక్ష్యంగా రఘురామ విమర్శలు కొనసాగాయి. ఆయన ఏ రోజయినా రాష్ట్ర సమస్యలపై మాట్లాడారా అని అడిగారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తారా అని ప్రశ్నించారు. కనీసం రైల్వే జోన్ కోసం చర్చకు పట్టుబట్టారా అని అడిగారు. పార్లమెంటరీ పార్టీ నేతగా మిథున్ రెడ్డి సరిపోరు అనేలా మాట్లాడారు. పార్లమెంటరీ పార్టీ నేత కోసం ఎన్నికలు పెట్టాలని కోరారు. అప్పుడు ఎవరు ఏంటో తెలుస్తోంది అని చెప్పారు.

3 ఓట్లు కూడా రావు..
రహస్య ఓటింగ్ ద్వారా ఎన్నిక పెట్టాలని కోరారు. సీక్రెట్ బ్యాలెట్లో మిథున్ కి 3 ఓట్లు కూడా రావు అని రఘురామ దుయ్యబట్టారు. మిగిలిన ఓట్లు తనకే వస్తాయని ధీమాతో ఉన్నారు. పార్టీ అంటే ఒక కులం కాదు, మతం కాదన్నారు. కులస్తుల కోసమేనా పోస్టులు అని దుయ్యబట్టారు. రెడ్లు ఇప్పటికే మంచి సీట్లు తీసుకున్నారని గుర్తుచేశారు. రాజ్యసభలో విజిటర్స్ గ్యాలరీలో మరికొందరినీ కూర్చోబెట్టారని.. యాభై శాతం కూడా అటెండెన్స్ లేని కొందరు అంటూ ధ్వజమెత్తారు. సామాజిక వర్గం,అడుగులు మడుగులు ఒత్తేవారికి పెద్ద పీట వేశారన్నారు.
Recommended Video

అనర్హత వేటు వేయండి
తనపై అనర్హత వేటు వేయాలని పార్లమెంటరీ పార్టీ నేత ఎంపీ మిథున్ రెడ్డి మళ్లీ కోరుతున్నారని పేర్కొన్నారు. రాజ్యాంగంలోని షెడ్యూల్ 10ని ఓసారి చదువాలని సూచించారు. మిథున్ రెడ్డిపై చాలామంది ఎంపీలకు అసంతృప్తి ఉందని హాట్ కామెంట్స్ చేశారు. తనను పార్టీ నుంచి బహిష్కరించినా.. పార్లమెంట్ కమిటీ చైర్మన్గా కొనసాగుతానని స్పష్టం చేశారు. కావాలంటే తనను పార్టీ నుంచి బహిష్కరించి చూడాలని సవాల్ విసిరారు. చట్ట ప్రకారం తనపై అనర్హత వేటు వేయడం సాధ్యం కాదన్నారు. కమిటీ చైర్మన్ పదవి తన వాక్పటిమ కారణంగా వచ్చిందని.. తెలిపారు. కానీ వైసీపీలో ఒక కులానికే పదవులు దక్కుతున్నాయని విమర్శించారు.












Click it and Unblock the Notifications