రేప్: మృత్యువుతో పోరాడుతన్న మూడేళ్ల బాలిక
జైపూర్: 3 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి అతి దారుణంగా అత్యాచారానికి పాల్పడిన ఘటన రాజస్థాన్లోని కొనాటా ప్రాంతంలో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలిక మృత్యువుతో పోరాడుతోంది.
కొనాటా ప్రాంతంలోని రోడ్డు పక్కన ప్రైవేట్ పార్ట్స్ నుంచి రక్తస్రావం కారుతూ అపస్మారక స్థితిలో పడి ఉన్న బాలికను పోలీసు పెట్రోలింగ్ టీమ్ చూసి హుటాహుటిన సమీపంలోని నగరంలోని జేకే లోన్ ఆసుపత్రికి తరలించారు. బాలికకు సుమారు మూడు గంటల పాటు వైద్యులు సర్జరీ నిర్వహించి ఐసీయూలో ఉంచారు.
ఈ సంఘనటలో ఇప్పటికే పోలీసులు ఆటో రిక్షా డ్రైవర్తో సహా పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. శనివారం సాయంత్రమే బాలిక తండ్రి తన కుమార్తె కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురుద్వారాలోని ట్రాన్స్పోర్ట్ నగర్కు సమీపంలో స్నేహితులతో ఆడుకుంటుండగా తమ కుమార్తె కనిపించకుండా పోయిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
రాత్రి 8.30 గంటలకు వరకు తన కుమార్తె ఇంటికి వస్తుందని చూశామని, ఇంటికి రాకపోయే సరికే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితురాలి తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బాలిక కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు ఆదివారం అర్దరాత్రి 12.30 గంటల సమయంలో రోడ్డు పక్కన అపస్మారక స్థితిలో ఉన్న బాలికను ఆసుపత్రికి తరలించినట్లు ఎస్హెచ్ఓ నరేశ్ మీనా తెలిపారు.
బాధితురాలు ఇంకా షాక్లోనే ఉండటంతో వాంగూల్మాన్ని ఇంకా నమోదు చేయలేదని తెలిపారు. సీసీటీవీ పుటేజి ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో ఉన్నామని డీసీపీ కున్వార్ రాష్ట్రదీప్ తెలిపారు. ఈ అత్యాచార ఘటనపై కేసు నమోదు చేశామన దర్యాప్తును ప్రారంభించినట్లు చెప్పారు. నిందితులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించే పనిలో ఉన్నామని ఆయన తెలిపారు.
మరోవైపు ఈ అత్యాచార ఘటన గురించి తెలుసుకున్న రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే ఆరా తీశారు. విద్యాశాఖ మంత్రి కాళిచరణ్ సర్ఫ్తో ఆసుపత్రిలో బాధితురాలి కుటుంబ సభ్యులను కలిసిన రాష్ట్ర మహిళా కమిషన్ సుమన్ శర్మ బాలిక ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధితురాలికి అన్ని విధాలా సాయం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆమె తెలిపారు.