అసలు శివసేన మాదే! ఏక్నాథ్ షిండే సభాపక్ష నేత: గవర్నర్కు 34 మంది రెబల్ ఎమ్మెల్యేలు
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. శివసేన రెబల్ ఎమ్మెల్యేలు వెనక్కి తగ్గపోవడంతో శివసేన నేతృత్వంలోని ఎన్సీపీ-కాంగ్రెస్ మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం కూలిపోయే ప్రమాదంలో పడింది. శివసేన అధినేతలు చేసే ప్రయత్నాలు కూడా సఫలం కాలేదు. శివసేన అధినేత పిలుపు మేరకు ఇద్దరు ఎమ్మెల్యేలు షిండే క్యాంపు నుంచి బయటికి వచ్చారు. అయినా, ప్రభుత్వం నడిపే బలం లేకపోవడంతో సంక్షోభం తప్పేలా లేదు.
శివసేన అల్టిమేటం పట్టించుకోని రెబల్ ఎమ్మెల్యేలు
తాజాగా, బుధవారం సాయంత్రం 5 గంటలలోగా ఎమ్మెల్యేలంతా ముంబైకి చేరుకోవాలని శివసేన అధిస్థానం అల్టిమేటం జారీ చేసినా.. షిండే వర్గం వెనక్కి తగ్గలేదు. పార్టీ నుంచి తొలగిస్తామంటూ హెచ్చరించింది. అయితే, శివసేన ఆదేశాలు చట్టపరంగా చెల్లవని షిండే స్పష్టం చేస్తున్నారు. శివసేన శాసనసభా పక్ష చీఫ్ విప్గాఎమ్మెల్యే భరత్ గొగవాలే కొత్తగా నియమితులయ్యారని, దీంతో చీప్ విప్ సునిల్ ప్రభు ఇచ్చిన ఆదేశాలు చెల్లవని ఏక్ నాథ్ షిండే ట్వీట్ చేశారు.
ఏక్నాథ్ షిండేనే మా నేత: శిసేన రెబల్ ఎమ్మెల్యేలు
మరోవైపు, ఉద్ధవ్ థాక్రే సర్కారుపై షిండే తిరుగుబాటు చేయగానే ఆయనను శివసేన శాసనసభాపక్ష నేత హోదా నుంచి పార్టీ తప్పించింది. అయితే, రెబల్ ఎమ్మెల్యేలు మాత్రం ఆయనే తమ శాసనసభ నేతగా పేర్కొంటూ తీర్మానం చేశారు. ఈ సందర్బంగా రెబల్ ఎమ్మెల్యేలు మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి పట్ల తాము అసంతృప్తిగా ఉన్నామన్న రెబల్ ఎమ్మెల్యేలు.. రాజకీయ వ్యక్తిగత అవసరాల కోసం పార్టీ నేతలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.
శివసేన మాదే..: గవర్నర్కు 34 మంది రెబల్ ఎమ్మెల్యేల లేఖ
అసెంబ్లీలోనే శివసేన పార్టీ అంటే మాదే, అందుకే ఏక్ నాథ్ షిండేను శివసేన శాసనసభాపక్ష నేతగా కొనసాగించాలని నిర్ణయించామని తెలిపరాు. పార్టీ చీఫ్ విఫ్ గా సునిల్ ప్రభు స్థానంలో భరత్ గొగవాలేను నియమించుకున్నామన్నారు. కాగా, ఈ తీర్మానంపై 34 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ మహారాష్ట్ర గవర్నర్ కు , డిప్యూటీ స్పీకర్కు లేఖ రాశారు రెబల్ ఎమ్మెల్యేలు. మరోవైపు, సోషల్ మీడియా వేదికగా శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే కాసేపట్లో రాష్ట్ర ప్రజలనుద్దేశించి కీలక ప్రకటన చేయనున్నారు. ప్రభుత్వాన్ని రద్దు చేసే అవకాశం కనిపిస్తోంది.