35 మంది ఎయిమ్స్ వైద్యులకు కరోనా.. 24 గంటల్లో 1.31 లక్షల మందికి వైరస్
కరోనా కలవరం సృష్టిస్తోంది. కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. దేశ రాజధాని ఢిల్లీ సంగతి చెప్పక్కర్లేదు. రాత్రిపూట కర్ఫ్యూ విధించిన పరిస్థితిలో మార్పు లేదు. ఢిల్లీ ఎయిమ్స్లో పనిచేసే వైద్యులను కూడా కరోనా వదలడం లేదు. 35 మంది డాక్టర్లకు పాజిటివ్ వచ్చింది. అయితే అంతకుముందు సర్ గంగారం ఆస్పత్రిలో 37 మంది వైద్యులకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వారికి వైరస్ సోకింది.
వీరిలో 32 మంది హోం ఐసోలేషన్లో ఉన్నారు. వీరిలో కొందరికీ జ్వరం రావడంతో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. గురువారం ఢిల్లీలో 7437 కరోనా కేసులు వచ్చాయి. ఈ ఏడాదిలో ఇదే అత్యధిక కరోనా కేసులు కావడం విశేషం. వైరస్ సోకిన 24 మంది చనిపోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 11 వేల 157కి చేరింది. పాజిటివ్ వచ్చిన వారి సంఖ్య కూడా పెరుగుతుంది. రోజు 8.1 శాతంగా ఉంది. అంతకుముందు అదీ 6.1గా ఉండేది.
ముంబైతోపాటు ఢిల్లీలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని కోవిడ్ ఆస్పత్రిగా మార్చారు. ఇక్కడ ఇతర వ్యాధులకు చికిత్స అందించడం లేదు. మరోవైపు గురువారం వ్యాక్సిన్ అందజేసే అధికారికి కూడా కరోనా సోకడం కలకలం రేపింది. గత 24 గంటల్లో దేశంలో కరోనా వైరస్ కేసులు 1.31 లక్షలు నమోదయ్యాయి.