మరో ఏక్నాథ్ షిండే రెడీ: మమత సర్కార్కు బీజేపీ ఎసరు: 38 మంది తృణమూల్ ఎమ్మెల్యేలపై వల
కోల్కత: దేశవ్యాప్తంగా ప్రకంపనలను సృష్టించిన మహారాష్ట్ర రాజకీయాలు.. అక్కడి ప్రభుత్వం కుప్పకూలడంతో ముగిశాయి. అధికార మహా వికాస్ అగాఢీ సంకీర్ణ కూటమికి మొన్నటి వరకు సారథ్యాన్ని వహించిన శివసేనలో చీలక తీసుకుని రావడంతో భారతీయ జనతా పార్టీ విజయాన్ని సాధించింది. చీలిక కూటమి నాయకుడు ఏక్నాథ్ షిండేను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టింది. శివసేన చీలిక వర్గ శాసనసభ్యుల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది బీజేపీ.
అమెరికాతో చైనా మాటల యుద్ధం: ఘాటుగా వార్నింగ్: ఎప్పుడేం జరుగుతుందో..?
38 మంది బీజేపీతో టచ్లో..
ఇప్పుడు అలాంటి రాజకీయాలకు పశ్చిమ బెంగాల్లో శ్రీకారం చుట్టినట్టే కనిపిస్తోంది. పశ్చిమబెంగాల్లో ముఖ్యమంత్రి మమత బెనర్జీ సారథ్యంలో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్లో చీలక తీసుకుని రావడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అందులో కూడా కొంతమేర సఫలమైందనే ప్రచారం సాగుతోంది. అధికార తృణమూల్ కాంగ్రెస్కు చెందిన 38 మంది శాసన సభ్యులు బీజేపీతో సంప్రదింపులు జరుపుతున్నట్లు చెబుతున్నారు.
బ్రేకింగ్ న్యూస్ అంటూ..
వారిలో 21 మంది ఎమ్మెల్యేలు నేరుగా తమతో మంతనాలు సాగిస్తున్నారని బీజేపీ సీనియర్ నాయకుడు, ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి స్పష్టం చేశారు. ఈ మధ్యాహ్నం ఆయన కోల్కతలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బ్రేకింగ్ న్యూస్ ఏదైనా ఉందా? అంటూ విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు. తృణమూల్ కాంగ్రెస్కు చెందిన ఎమ్మెల్యేలు బీజేపీ నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నారనే విషయాన్ని ఆయన నుంచి రాబట్టడానికే ఈ ప్రశ్న సంధించినట్లు చెబుతున్నారు.
అన్ని విషయాలు త్వరలోనే..
దీనిపై మిథున్ చక్రవర్తి మాట్లాడారు. 38 మంది తృణమూల్ ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని స్పష్టం చేశారు. ఇంతకంటే బ్రేకింగ్ న్యూస్ ఇంకేం కావాలని ప్రశ్నించారు. దీనిపై విలేకరులు మరిన్ని ప్రశ్నలను సంధించడానికి ప్రయత్నించగా.. ఆయన సమాధానాలను దాట వేశారు. ప్రస్తుతానికి ఇంతకంటే ఎక్కువ ఏమీ చెప్పలేనని అన్నారు. త్వరలోనే మీడియాకు అన్ని విషయాలు తెలుస్తాయని కొసమెరుపు ఇచ్చారు.
220 మంది..
గత ఏడాది నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. 294 మంది సభ్యుల బలం ఉన్న అసెంబ్లీలో తృణమూల్ కాంగ్రెస్కు ఉన్న సంఖ్యాబలం 220. మిత్రపక్షం బీజీపీఎంతో కలుపుకొని మొత్తం 221 మంది సభ్యులు తృణమూల్ కాంగ్రెస్కు ఉన్నారు. అధికారంలోకి వస్తామంటూ చివరి వరకు భావించిన బీజేపీ మూడంకెలను కూడా అందుకోలేకపోయింది. 71 స్థానాలకే పరిమితమైంది.
అప్పటికప్పుడు ముప్పు లేకపోయినా..
మిథున్ చక్రవర్తి చెప్పినట్లుగా తృణమూల్కు చెందిన 38 మంది శాసన సభ్యులు గంపగుత్తగా పార్టీ ఫిరాయించినప్పటికీ.. మమత బెనర్జీ ప్రభుత్వానికి అప్పటికప్పుడు వచ్చిన ముప్పు ఉండకపోవచ్చు గానీ.. ప్రమాదం మాత్రం పొంచి ఉన్నట్టవుతుంది. పశ్చిమ బెంగాల్కే చెందిన గవర్నర్ జగ్దీప్ ధన్కర్ను కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడంతో ఆ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించినట్టయిందనే వాదనలు లేకపోలేదు.