డ్యూటీలో 4,132 జవాన్లు మృతి - కాశ్మీర్ లో 138 టెర్రరిస్టులు హతం - కేంద్ర హోం శాఖ వివరణ
దేశ అంతర్గత భద్రతలో అత్యంత కీలకంగా వ్యవహరించే పారామిలటరీ బలగాల్లో మరణాలకు సంబంధించి, అలాగే, జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదుల ఏరివేతపైనా కేంద్ర హోం శాఖ కీలక ప్రకటన చేసింది. సదరు అంశాలపై ఎంపీలు అడిగిన ప్రశ్నలకు.. హోం శాఖ సహాయ మంత్రులు కిషన్ రెడ్డి, నిత్యానంద రాయ్ విడివిడిగా లిఖితపూర్వక సమాధానాలిచ్చారు.
మంత్రి నిత్యానంద రాయ్ వివరణ ప్రకారం.. 2017 నుంచి 2019 మధ్య దేశవ్యాప్తంగా మొత్తం 4,132 మంది పారామిలటరీ సిబ్బంది డ్యూటీల్లో ఉండగా ప్రాణాలు కోల్పోయారు. వారిలో జవాన్ల నుంచి ఉన్నతాధికారుల వరకు ఉన్నారు. పారామిలటరీలోని విభాగాల వారీగా చూస్తే.. అత్యధికంగా సీఆర్పీఎఫ్ కు చెందిన 1597 మంది విధులు నిర్వహిస్తూ చనిపోయారు. బీఎస్ఎఫ్ సిబ్బంది 725 మంది, సీఐఎస్ఎఫ్ 671, ఐటీబీపీకి చెందిన 429 మంది, సశస్త్ర సీమాబల్ విభాగంలో 329 మంది, అస్సాం రైఫిల్స్ కు చెందిన 381 మంది డ్యూటీల్లో ఉండగా చనిపోయారు. ఇక,

జమ్మూకాశ్మీర్ లో గడిచిన ఆరు నెలల వ్యవధిలో(2020, మార్చి 1 నుంచి 2020 ఆగస్టు 31 వరకు) మొత్తం 138 మంది టెర్రరిస్టుల్ని మట్టుపెట్టామని, అదే సమయంలో భద్రతా దళాలకు చెందిన 50 మంది అమరులయ్యారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు సంబంధిత ప్రశ్నకు ఆయన లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.
జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించరాదనే నిర్ణయానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, టెర్రరిస్టుల్ని, టెర్రరిజాన్ని అణిచివేయడంలో భద్రతా దళాలు సమర్థవంతంగా, నిరంతరాయంగా పనిచేస్తున్నాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. 2019 ఆగస్టు నుంచి 2020 జులై వరకు సరిహద్దు వెంంబడి 176 చొరబాటు ప్రయత్నాలు జరిగాయని, బలగాలు అప్రమత్తంగా వ్యవహరించి ఆ ప్రయత్నాలను తిప్పికొట్టారని మంత్రి వివరించారు.












Click it and Unblock the Notifications