యుపిలో పట్టాలు తప్పిన రైలు: నలుగురు మృతి
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించినట్లు అనుమానిస్తున్నారు. టాటానగర్ - జమ్మూ మురి ఎక్స్ప్రెస్ రైలు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కౌశాంబి జిల్లాలో పట్టాలు తప్పింది.
ఈ ప్రమాదం సోమవారం సాయంత్రం 2 గంటల ప్రాంతంలో సిరతు రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది. ఈ ప్రాంతం అలహాబాదుకు సమీపంలో ఉంటుంది. రైలు చాలా మెల్లగా నడుస్తోందని, ప్రమాదంలో బోగీలకు ఏ విధమైన నష్టం జరగలేదని ప్రాథమిక సమాచారం అందుతోంది.
రైలు పట్టాలు తప్పడంతో ఓ బోగీ పూర్తి దెబ్బ తిన్నదని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఎ1, బి1, బి2, ఐదు స్లీపర్ కోచ్లు, ఓ జనరల్ కోచ్ పట్టాలు తప్పాయి. జనరల్ కోచ్ తీవ్రంగా దెబ్బ తిన్నట్లు తెలుస్తోంది.
స్థానికులు, ఇరుగుపొరుగు గ్రామాలవాళ్లు సహాయక చర్యలు చేపట్టారు. అలహాబాద్ నుంచి సహాయ బృందాలు ప్రమాదస్థలికి చేరుకున్నాయి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చాలా వేగంగా ముందుకు కదిలింది.