అసదుద్దీన్ ఒవైసీకి షాకిచ్చిన ఎమ్మెల్యేలు: నలుగురు పార్టీ ఫిరాయింపు
పాట్నా: అఖిల భారత మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అధినేత, హైదరాబాద్ లోక్సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీకి సొంత పార్టీకి చెందిన నలుగురు శాసన సభ్యులు షాకిచ్చారు. పార్టీ ఫిరాయించారు. ప్రధాన ప్రతిపక్షంలో చేరిపోయారు. ప్రతిపక్ష నేత, రాష్ట్రీయ జనతాదళ్ సీనియర్ నేత తేజస్వి యాదవ్.. సాదరంగా వారిని పార్టీలోకి ఆహ్వానించారు. దీనితో బిహార్ అసెంబ్లీలో ఇప్పటివరకు మజ్లిస్కు ఉన్న బలం ఒకటికి పడిపోయింది.
చండీగఢ్లో మంత్రి హరీష్ రావు: కేంద్రమంత్రి నిర్మలమ్మతో భేటీ: కీలక అంశాల ప్రస్తావన
2020లో నవంబర్లో నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ చెప్పుకోదగ్గ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. 20 స్థానాల్లో పోటీ చేయగా.. అయిదుమంది అభ్యర్థులు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అప్పట్లో వారంతా హైదరాబాద్కు వచ్చి మరీ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీని కలిశారు. పార్టీలో కొనసాగారు. ఈ రెండు సంవత్సరాల కాలంలో బిహార్లో చోటు చేసుకుంటూ వస్తోన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో- మజ్లిస్ ఎమ్మెల్యేలు పార్టీని వీడారు.
బిహార్లో క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి అధిష్ఠానం పెద్దగా దృష్టి సారించకపోవడం, ఉన్న కొద్దిపాటి కేడర్ కూడా పార్టీ కార్యకలాపాలపై పెద్దగా దృష్టి సారించకపోవడం వంటివి ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. అదే సమయంలో తేజస్వి యాదవ్ సారథ్యంలో ఆర్జేడీ ఇదివరకటి కంటే బలంగా తయారవుతున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అయిదుమందిలో నలుగురు పార్టీ ఫిరాయించారు. ఆర్జేడీలో చేరారు.
బిహార్ అసెంబ్లీలో ఏఐఎంఐఎంకు అయిదుమంది శాసనసభ్యులు ఉన్నారు. వారిలో కొచ్చదమం ఎమ్మెల్యే మహ్మద్ ఇజార్ అస్ఫి, జొకిహట్ స్థానం నుంచి గెలుపొందిన షానవాజ్, బైసీ స్థానానికి ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న సయ్యద్ రుక్నుద్దీన్, బహదూర్ గంజ్ ఎమ్మెల్యే అజర్ నయీమి పార్టీ ఫిరాయించారు. అమౌర్ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన అఖ్తరుల్ ఇమాన్ ఒక్కరే ప్రస్తుతం మజ్లిస్లో కొనసాగుతున్నారు.
2020 నాటి ఎన్నికల్లో గణనీయమైన ఓట్ల శాతాన్ని సాధించి మజ్లిస్. ఆ పార్టీ అభ్యర్థులకు మొత్తంగా 5,23,279 ఓట్లు పోల్ అయ్యాయి. ఉపేంద్ర కుష్వాహా సారథ్యంలోని గ్రాండ్ డెమొక్రటిక్ సెక్యులర్ ఫ్రంట్తో పొత్తు పెట్టుకుని అప్పట్లో ఏఐఎంఐఎం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది. 20 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టగా.. అయిదు చోట్ల వారు ఘన విజయం సాధించారు. ప్రస్తుతం కుష్వాహా పార్టీ కూడా మనుగడలో లేదు. దాన్ని రాష్ట్రీయ లోక్ సమత పార్టీలో విలీనం చేశారు.