కరోనా కల్లోలం : నలుగురు సుప్రీం న్యాయమూర్తులు - 400 మంది పార్లమెంట్ సిబ్బందికి పాజిటివ్..!!
దేశంలో మరోసారి కరోనా కల్లోలం మొదలైంది. దేశ వ్యాప్తంగా రోజు రోజుకీ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతోంది. కొత్త సంవత్సరం నుంచి ప్రారంభమైన సమయం లో మొదలైన కేసుల సంఖ్య.. వారం రోజుల్లోనే నిత్యం లక్షకు పైగా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1,59,632 మంది వైరస్ బారిన పడ్డారు. కరోనా వల్ల మరో 327మంది మృతి చెందారు. 40,863 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. కొవిడ్ విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 10.21 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
రోజు రోజుకీ పెరుగుతున్న కేసులు
దేశంలో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. 27 రాష్ట్రాలు..కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 3,0623కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అందులో 1,409 మంది కోలుకున్నట్లు తెలిపింది. అత్యధికంగా మహారాష్ట్ర 1,009 ఒమిక్రాన్ కేసులతో తొలి స్థానంలో ఉంది.
513 మంది ఒమిక్రాన్ బాధితులతో దిల్లీ తర్వాత స్థానంలో ఉంది. నలుగురు సుప్రీం న్యాయమూర్తులు కరోనా బారిన పడ్డారు. 150 మంది అత్యున్నత న్యాయస్థాన సిబ్బంది పరీక్షల్లో కోవిడ్ పాజిటివ్ గా లేదా లక్షణాలతో గుర్తించారు. ఇప్పటికే పెరుగుతున్న కేసుల కారణంగా రానున్న 4-6 వారాల పాటు ప్రత్యక్ష విచారణ సుప్రీంలో నిలిపివేస్తూ సుప్రీం ప్రధాన న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్నారు.
న్యాయమూర్తులు..వైద్యులు కరోనా బారిన
దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 5,90,611 గా ఉండగా, ఇప్పటి వరకు కరోనా బారిన పడి కోరుకున్న వారి సంఖ్య 3,44,53,603గా నిర్దారించారు. కాగా, ఇప్పటి దాకా కరోనా మహమ్మారి బారిన పడి దేశ వ్యాప్తంగా 4,83,790 ప్రాణాలు కోల్పోయారు. ఇక, మహారాష్ట్రలో వైద్యులను కరోనా దెబ్బతీసింది.
250 మందికి పైగా వైద్యులు కరోనా బారిన పడ్డారు. మహారాష్ట్రలో ఇప్పటికే పలు ఆంక్షలు అమలు చేస్తున్నారు. కాగా, రేపటి నుంచి రాత్రి సమయాల్లో కర్ఫ్యూ అమలుకు నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంట్ లో పని చేస్తున్న సిబ్బందిలో దాదాపు 400 మందికి పైగా కరోనా బారిన పడ్డారు. సిబ్బందికి మొత్తానికి పరీక్షలు నిర్వహిస్తున్న సమయంలో వీరిలో పాజిటివ్ నిర్దారణ అయింది.
రేపటి నుంచి బూస్టర్ డోసులు
దీంతో..విధులకు హాజరయ్యే సిబ్బంది విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇక, రేపటి నుంచి ఫ్రంట్ లైన్ వర్కర్స్... కరోనా వారియర్స్ కు బూస్టర్ డోసులు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఇక, కర్ణాటక.. తమిళనాడు రాష్ట్రాల్లోకూ కేసుల సంఖ్య భారీగా ఉంటోంది. డిల్లీ.. ముంబాయి నగరాల్లో రోజువారీ నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఆందోళన కరంగా మారుతోంది. దీంతో.. మరిన్ని కఠిన ఆంక్షల దిశగా ప్రభుత్వాలు ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం.