మోడీ వెంటే దేశ ప్రజలు: నాలుగేళ్ల పాలనపై బీజేపీ గర్వంగా ఉందన్న అమిత్ షా
న్యూఢిల్లీ: వచ్చే ఎన్నికల్లోనూ భారతీయ జనతా పార్టీ వందశాతం మళ్లీ గెలుస్తుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ అభివృద్ధి అజెండాను ప్రజలు అంగీకరించారని అమిత్షా అన్నారు. ప్రధాని మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటికి నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో అమిత్షా మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా మోడీ అమలు చేస్తున్న సంస్కరణలపై ఆయన ప్రశంసల జల్లు కురిపించారు. 'కుటుంబ, కుల రాజకీయాలకు ప్రధాని మోడీ ముగింపు పలకడమేకాకుండా అభివృద్ధి రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఒకే ర్యాంకు ఒకే పింఛను(ఓఆర్ఓపీ) సమస్యను మోడీ ప్రభుత్వం పరిష్కరించింది. అవినీతిని అడ్డుకునేందుకు ఆయన తీసుకున్న సంస్కరణలు సత్ఫలితాలను ఇచ్చాయి. ఆయన గ్రామీణాభివృద్ధికి కట్టుబడి ఉన్నారు. ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు' అని అమిత్ షా వ్యాఖ్యానించారు.
అంతేగాక, 'యుద్ధాన్ని బీజేపీ చివరి అవకాశంగా భావిస్తుంది. ఎటువంటి రక్తపాతం జరగకుండా సరిహద్దులు సురక్షితంగా ఉండాలనే మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. బీజేపీ హయాంలో ఎక్కువ మంది ఉగ్రవాదులు హతమయ్యారు' అని షా తెలిపారు.
ఇంధన ధరలపై స్పందిస్తూ.. 'ప్రస్తుతమున్న పెట్రోల్, డీజిల్ ధరలు కాంగ్రెస్ ప్రభుత్వంలో మూడేళ్ల పాటు ఉన్నాయి. కానీ, ఇప్పుడు మాత్రం కేవలం కొద్ది రోజులు ఇంధన ధరలు పెరిగిపోతేనే వాళ్లు విసిగిపోతున్నారా? ఇంధన ధరల తగ్గింపు విషయంపై ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. దీనికి దీర్ఘకాల పరిష్కారం కోసం మోడీ సర్కారు ప్రయత్నిస్తోంది' అని అమిత్ షా వివరించారు.
'అత్యంత కష్టపడి పనిచేసే ప్రధానమంత్రిని బీజేపీ దేశానికి ఇచ్చింది. దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే ఆయన ప్రజాదరణ పొందిన నాయకుడు. రోజుకు 15-18గంటలు పనిచేస్తూ ఉంటారు. ఇటువంటి ప్రధాని బీజేపీకి చెందిన వ్యక్తి అయినందుకు ఎంతో గర్విస్తున్నాం' అని అమిత్ షా వెల్లడించారు.