మోదీ నాలుగేళ్ల పాలన.. మిశ్రమ ఫలితాలు...
ప్రధానిగా నరేంద్ర మోదీ పరిపాలకు నలుగేళ్లు నిండాయి. నాలుగేళ్ల పాలన పై ఎక్కువ శాతం ప్రజలు పెదవి విరుస్తున్నారు. సంక్షేమ ఫలితాలు క్షేత్ర స్థాయిలో అమలు కాక దిగువశ్రేణి ప్రజలు మోదీ పాలనపై పెదవి విరుస్తున్నారు. మోదీ హయాంలో తీసుకొచ్చిన జీఎస్టీ, నోట్ల రద్దు వంటి పథకాలకు ప్రజల్లో మిశ్రమ ఫలితాలు వచ్చినట్టు తెలుస్తోంది.
మోదీ ఎంత సుపరిపాలన అందించారో అంతే స్థాయిలో చేదు జ్ఞాపకాలను కూడా మిగిల్చారు
యూపీఏ1, యూపీఏ2 పాలన తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘనవిజయం సాదించింది. కాంగ్రేస్ పార్టీ పాలనతో విసిగి పోయిన దేశ ప్రజలు బీజేపి కి తిరుగులేని మెజారిటీ కట్టబెట్టారు. దీంతో 14వ ప్రధానిగా ప్రమాణం స్వీకారం చేసిన నంరేంద్ర దామోదర దాస్ మోదీ పైన దేశ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. దేశ ప్రజల ఆశలను మోదీ ఎంత వరకు నెరవేర్చారో తెలియదు గాని ఆయన పరిపాలనకు మాత్రం నాలుగు సంవత్సరాలు పూర్తయ్యాయి. మోదీ నాలుగేళ్ల పాలనలో ప్రజలకు ఎంత సుపరిపాలన అందించారో అంతే స్థాయిలో చేదు జ్ఞాపకాలను కూడా మిగిల్చారని ప్రజల్లో మిశ్రమ స్పందన వస్తోంది.
ఆశించిన ఫలితాలివ్వని నోట్ల రద్దు, జీఎస్టీ.. సామాన్యుల పెదవి విరుపు
మోదీ జయాపజయాలను ఒకసారి బేరీజు వేసుకుంటే ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తాయి. నల్లధనం అదుపు, నకిలీనోట్ల నియంత్రణకు పెద్దనోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న మోదీకి ఆశించిన మేర ఫలితాలు మాత్రం రాలేదు. లెక్కలోకి రాని సంపద దేశ ఆర్థిక వ్యవస్థలోకి తిరిగి ఇతర రూపాల్లో రాకుండా అడ్డుకోలేకపోయారు. మేకిన్ ఇండియా పేరిట స్వదేశంలో తయారయ్యే వస్తువులకు పెద్దపీట వేస్తున్నట్టు ప్రకటించారు మోదీ. వివిధ ఉత్పత్తులను స్థానికంగానే తయారుచేయడంతో పాటు కొత్త నైపుణ్యాల సృష్టికి ఉపయోగపడుతుందని భావించిన ఈ కార్యక్రమం పెద్దగా విజయవంతం కాలేదు.
బాంక్ కుంభకోణాలు, మోదీ ప్రభుత్వానికి మచ్చ..
మోడీ పాలనలో బాంక్ కుంభకోణాలు పెద్దయెత్తున జరగడం బీజేపి ప్రభుత్వానికి శరాఘాతంలా పరిణమించింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూ.13 వేల కోట్లకు పైగా కుంభకోణంలో మునగడం, ఇతర బ్యాంకుల్లో సైతం అడపాదడపా కుంభకోణాలు బయటపడడం ప్రతిబంధకంగా మారింది. కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో పూర్తిస్థాయిలో రుణమాఫీ కోసం డిమాండ్ పెరుగుతోంది. ఏటా కోటి ఉద్యోగాలు కల్పిస్తామని వాగ్దానం చేసినా గత నాలుగేళ్లలో పదిలక్షల ఉద్యోగ అవకాశాలు మాత్రమే కల్పించారు. ఈ ఏడాది బడ్జెట్లో జాతీయ ఉద్యోగ, ఉపాధి విధానాన్ని ప్రకటిస్తారని భావించినా అది జరగలేడు. ప్రధానిగా మోదీ 53 దేశాల్లో పర్యటించారు. ఈ విదేశీ పర్యటనలపై విపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేశాయి. అవన్నీ పట్టించుకోకుండా చైనా తదితర దేశాలతో మిత్రత్వం సాధించగలిగారు మోదీ.
ముస్లిం మైనారిటీలకు దగ్గరయ్యే యత్నం.. ట్రిపుల్ తలాక్ పై స్పందన అంతంత మాత్రమే
మోదీ విదేశీ పర్యటనల ఫలితాలు ఎలా ఉన్నా ఉగ్రవాద దేశాల మీద ఉక్కు పాదం మోపాలన్న నినాదం మాత్రం దేశ ప్రజలను ఎంతగానో ఆకర్శించింది. అయితే జమ్మూ,కశ్మీర్ విషయంలో పాకిస్తాన్తో సమస్య అలాగే కొనసాగుతోంది. దాయాది దేశం అనుసరిస్తున్న ద్వంద్వ విధానాలు అగ్నికి ఆజ్యం పోసినట్టుగా మారడంతో అక్కడ ఉద్రిక్తతలు సాగుతున్నాయి. దేశంలోని బ్యాంకుల నుంచి వేలకోట్ల రుణాలు తీసుకుని విదేశాలకు చెక్కేసిన విజయ్మాల్యా, నీరవ్మోదీ, తదితరుల విషయంలో మోదీ ప్రభుత్వం అనుసరించిన విధానాలపై విమర్శలొచ్చాయి. అయితే విదేశాలకు పారిపోయిన ఈ ఎగవేతదారుల ఆస్తుల స్వాధీనానికి గత ఏప్రిల్లో తీసుకొచ్చిన చట్టం ప్రశంసలు అందుకుంది. మోదీ ప్రభుత్వంపై తీవ్రస్థాయి అవినీతి ఆరోపణలు రాలేదు. అందుకు భిన్నంగా యూపీఏ ప్రభుత్వంపై పెద్దెత్తున అవినీతి ఆరోపణలొచ్చాయి. బీజేపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేసినా అవి నిరూపితం కాలేదు. అప్పటికప్పుడు ఈ-మెయిల్, వాట్సాప్, ఫోన్, లేఖల ద్వారా మూడుసార్లు తలాఖ్ అంటూ ఇచ్చే విడాకులు చెల్లవంటూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. 2017 ముస్లిం మహిళల చట్టాన్ని కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెట్టింది.దీని పైన ముస్లిం మైనారిటీస్ లో ఆశించిన స్పందన మాత్రం రాలేదనే చర్చకూడా జరిగింది. క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్నా చమురు ధరలను కేంద్రం నిలువరించలేకపోందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.