బెంగాల్లో మలుపు: ఒక్కరోజే బిజెపిలోకి 40 వేలమంది
ఈ విషయాన్ని ఆ రాష్ట్ర బిజెపి అధ్యక్షులు రాహుల్ సిన్హా వెల్లడించారు. దీనిపై సిన్హా స్పందిస్తూ.. బెంగాల్ బిజెపిలో ఒక్కసారే ఇంతమంది చేరడం శుభపరిణామమన్నారు. రాహుల్ సిన్హా ఆదివారం జంగల్ మహల్ ఏరియాలోని లోధాషులి, గోపిబల్లావపూర్, నయగ్రామ్, మోహన్ పురలలో పలు సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు బిజెపిలో చేరినట్లు చెప్పారు.
ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో బిజెపి చెప్పుకోదగ్గ స్థానాల్లో గెలుచుకోలేకపోయింది. అయితే గతంలో కంటే ఓటింగ్ శాతాన్ని భారీగా పెంచుకుంది. ఓటింగ్ శాతం దాదాపు నాలుగైదు రెట్లు పెరిగింది. ఈ నేపథ్యంలో రానున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నాటికి లెఫ్ట్ పార్టీల కంటే, అధికార తృణమూల్ కాంగ్రెసు పార్టీ కంటే ధీటుగా ఎదగాలని బిజెపి భావిస్తోంది.
రానున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ వర్సెస్ బిజెపిగా ఉండాలని కమలనాధులు భావిస్తున్నారు. ఇందుకోసం ప్రధాని మోడీ పావులు కూడా కదుపుతున్నారు. అమిత్ షా బెంగాలీ కూడా నేర్చుకుంటున్నారట. సార్వత్రిక ఎన్నికల్లో ఓటింగ్ శాతం బాగా పెరడం, ఇప్పుడు నలభై వేల మంది బిజెపిలో చేరడంపై కమలనాథులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.