తమిళనాడులో మంచినీటి కటకట .. మంత్రి రాజీనామా చేయాలని డీఎంకే డిమాండ్
కోయంబత్తూరు : తమిళనాడులో నీటి కటకట ఏర్పడింది. భూగర్భ జలాలు అడుగంటడంతో జనం ఆగచాట్లు పడుతున్నారు. ఇక రాజధాని నగరం చెన్నైలో పరిస్థితి వర్ణణాతీతం. నీటి సమస్య తీర్చాలని విపక్షాలు ఆందోళన చేపడుతున్నాయి. ఇటీవల మద్రాసు హైకోర్టు కూడా ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన సంగతి తెలిసిందే. తాజాగా డీఎంకే కార్యకర్తల ఆందోళన ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది.
నీటి కోసం పాట్లు ..
వాస్తవానికి తమిళనాడులో నీటి సమస్య ఎక్కువగా ఉంది. ఇందులో కోయంబత్తూరు, చెన్నైలో నీటి పాట్లు ఎక్కువే ఉన్నాయి. దీంతో నీటి సమస్య తీర్చడం లేదని మున్సిపల్ శాఖ మంత్రి ఎస్పీ వేలుమణి రాజీనామా చేయాలని డీఎంకే కార్యకర్తలు డిమాండ్ చేశారు. దాదాపు 400 మంది కార్యకర్తలు కోయంబత్తూరులో ఆందోళన చేపట్టారు. ఓ మంత్రిగా ఉండి .. కనీసం తమ సమస్యను తీర్చడం లేదని వారు మండిపడ్డారు. మాజీ మంత్రి ఎన్ పళనిస్వామి, ఎమ్మెల్యే ఎన్ కార్తీక్ ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టారు.

ఖాళీ బిందెలతో ..
కోయంబత్తూరు కార్పొరేషన్కు చేరుకున్న డీఎంకే శ్రేణులు పెద్దఎత్తున నినాదాలు చేశారు. మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నీటి సమస్యను తీర్చడంలో విఫలమయ్యారని మండిపడ్డారు. వీరి నిరసనలో దాదాపు వంద మంది మహిళలు కూడా పాల్గొన్నారు. ఖాళీ బిందేలతో తమ నీటి కష్టాలను వివరించే ప్రయత్నం చేశారు. తమకు నీటి సౌకర్యం కల్పించాలని ప్ల కార్డులు ఎత్తి నినాదించారు. గత 20 రోజుల నుంచి తాము నీటి కష్టాలు పడుతుంటే ... ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా లేదని మండిపడ్డారు. అంతేకాదు ఫ్రెంచ్ ప్రాజెక్టుకు 24 గంటల నీటిని వెంటనే ఆపేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆ పైపులైన్ తామే ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. అయితే అధికారుల నుంచి అనుమతి లేకుండా నిరసన చేపడుతున్నారనే కారణంతో డీఎంకే కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications