బెంగళూరు చెరువులో ఎగసిన మంటలు: 5 వేల మంది ఆర్మీ సిబ్బంది, 7 గంటలపాటు!
Recommended Video
బెంగళూరు: బెంగళూరు నగరంలోని సిల్క్ బోర్డు-మారతహళ్ళి రింగ్ రోడ్డులోని బెళ్లందూరు చెరువులో మరోసారి దట్టమైన పొగలు, మంటలు ఎగజిమ్మాయి. శుక్రవారం రాత్రికి మంటలు పెద్ద ఎత్తున ఎగిశాయి. పొగ కారణంగా చుట్టుపక్కల ప్రజలు ఊపిరాడక నానా ఇబ్బందులు పడ్డారు.
శుక్రవారం మధ్యాహ్నం దట్టమైన పొగలు రావడాన్ని గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది బెళ్లందూరు చెరువు దగ్గరకు చేరుకుని పొగను నియంత్రించడానికి చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది. మంటలు రాత్రి వరకూ అదుపులోకి రాకపోవడంతో స్థానికులు ఆందోళన చెందారు.
అగ్నిమాపక సిబ్బంది, బీబీఎంపీ సిబ్బంది, అటవి శాఖ సిబ్బందితో పాటు మేజర్ జనరల్ ఎన్.ఎన్.రాజపురోహిత్ నేతృత్వంలో సుమారు 5 వేల మంది రక్షణ శాఖ సిబ్బంది మంటల్ని అదుపు చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేసి చివరికి 7 గంటలు కష్టపడి మంటలు అదుపు చేశారు.
1,000 ఎకరాలకు పైగా విస్తీర్ణం గల చెరువులో కాలుష్య నియంత్రణకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా ప్రయోజనం లేకుండా పోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. బెళ్లందూరు చెరువులో దట్టమైన పొగలు, మంటలు రావడం ఇది అయిదోసారి. చుట్టుపక్కల ఉన్న పరిశ్రమలు, అపార్ట్ మెంట్ లోని మురికి నీరు, కెమికల్ పదార్థాలు బెళ్లందూరు చెరువులోకి వదిలిపెట్టడం వలనే ఇలా మంటలు ఎగిసిపడుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి.