ఆలయం వద్ద కారు పేలుడు కేసు: ఐదుగురు నిందితులపై యూఏపీఏ, ఉగ్ర లింకులు
చెన్నై: తమిళనాడులోని కోయంబత్తూరులోని కొట్టై ఈశ్వరన్ దేవాలయం సమీపంలో ఆదివారం కారులో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో కారులోనే వచ్చిన జమేషా ముబీన్ అనే వ్యక్తి మరణించాడు. అతను ప్రయాణిస్తున్న కారులో సిలిండర్ పేలడంతోనే ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.
ఆలయంలో పేలుడుకు పాల్పడేందుకు వచ్చిన సమయంలోనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ముబీన్ ప్రయాణిస్తున్న కారులో మేకులు, గోళీలు కూడా లభించాయని పోలీసులు తెలిపారు. అయితే, ఈ కేసులో ఉగ్రలింకులు బయటికొస్తున్నాయి. తాజాగా, ఈ కేసుకు సంబంధించి మరో ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులతోపాటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ భద్రతను మరింత కట్టుదిట్టం చేశాయి.
అదుపులోకి తీసుకున్న నిందితులను ముహమ్మద్ తల్కా, ముహమ్మద్ అజరుద్దీన్, మహ్మద్ రియాజ్, ఫిరోజ్ ఇస్మాయిల్, మహమ్మద్ నవాజ్ ఇస్మాయిల్గా గుర్తించామని పోలీసులు తెలిపారు. ఐదుగురు నిందితులపై యూఏపీఏ కింద కేసు నమోదు చేశారు. నిందితుల నుంచి పేలుడు పదార్థాలైన పొటాషియం నైట్రేట్ ను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
పేలుడు ఘటనలో మృతి చెందిన ముబీన్ ఇంట్లో నుంచి కూడా పొటాషియం నైట్రేట్ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. శనివారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో ముబీన్ ఇంటి నుంచి ఓ గోనె సంచిలో పేలుడు పదార్థాలను ఐదుగురు మోసుకెళ్తున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయని పోలీసులు తెలిపారు. ఆ ఐదుగురిలో ముబీన్ కూడా ఉన్నట్లు, మిగితా వ్యక్తుల గురించి మరింత సమాచారం తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.
ఈ పేలుడు ఘటనలో ఉగ్రవాద లింకులున్నా.. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై మండిపడ్డారు. నిందితులకు ఐఎస్ఐఎస్తో లింకులు ఉన్నాయన్నారు. పేలుడును అరికట్టడంలో రాష్ట్ర నిఘా వ్యవస్థ విఫలమైందంటూ విమర్శించారు. దీనికి అధికార డీఎంకేనే బాధ్యత వహించాలన్నారు.
మరోవైపు, అధికార డీఎంకే మంత్రి వి సెంథిల్బాలాజీ స్పందిస్తూ.. తమిళనాడులో ప్రతిపక్ష పార్టీ నాయకులు "అశాంతి సృష్టించారు" అని ఆరోపించారు. "గొర్రెల వేషధారణలో ఉన్న నక్కల కోరిక నెరవేరదు" అని వి సెంథిల్బాలాజీ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సంస్థల పరువు తీయడానికి ఎవరైనా ప్రయత్నిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని బీజేపీ నేతలను ఉద్దేశించి ఆయన హెచ్చరించారు.