30సెకన్లలో కార్పొరేటర్ను నరికేశారు: కెమెరాకు చిక్కిన దృశ్యాలు
చెన్నై: తమిళనాడులో సంచలనం సృష్టించిన చెన్నై కార్పొటరు హత్యలో పోలీసులకు కీలక ఆధారంగా సీసీ టీవీ ఫుటేజీలు లభించాయి. హత్య జరిగిన దుకాణంలో సీసీ టీవీ కెమెరాలు ఉండటంతో వాటిలో నిక్షిప్తమైన దృశ్యాలను పోలీసులు పరిశీలించారు. దుండగులు వచ్చి హత్య చేసి వెళ్లే వరకు 30 సెకన్ల సమయం పట్టినట్లు గుర్తించారు.
ఈ ఫుటేజీల ఆధారంగా హంతకుల కోసం పోలీసులు గాలింపు చేపట్టిన పోలీసులు ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. చెన్నై కార్పొరేషన్ 21వ డివిజన్ అన్నాడీఎంకే కార్పొరేటరు జ్ఞానశేఖర్ శనివారం సాయంత్రం మణలిలోని ఓ దుకాణంలో దారుణహత్యకు గురయ్యారు. తన మిత్రుడి కుదువ వ్యాపారం దుకాణంలో టీ తాగుతూ పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతుండగా ఈ దారుణం జరిగింది. అందరూ చూస్తుండగానే కార్పొరేటర్ను దారుణంగా నరికిచంపడం గమనార్హం.
కుదువ(తాకట్టు) దుకాణం బయట సీసీ టీవీ కెమెరాలు ఉండటంతో పోలీసులు వాటి ఫుటేజీలను పరిశీలించారు. దుకాణం ఎదురుగా కొద్ది దూరంలో దుండగులు రెండు ద్విచక్ర వాహనాలను నిలిపి జ్ఞానశేఖర్ రాకకోసం నిరీక్షిస్తున్నట్లు తెలిసింది. జ్ఞానశేఖర్ అక్కడకు వచ్చిన కొద్దిసేపటికి వాహనాల వద్ద ఒకరు నిలబడగా... నలుగురు దుకాణం వైపు వచ్చారు. అందులో ఒకరు కత్తితో దుకాణానికి బయట కాపాల ఉండగా.. మిగతా ముగ్గురు లోపలికి వెళ్లి జ్ఞానశేఖర్ను నరికే దృశ్యాలు సీసీ టీవీ కెమెరాల్లో నమోదయ్యాయి.
హంతకుల్లో ఇద్దరు హెల్మెంట్ ధరించగా ఒకరు మామూలుగానే ఉన్నాడు. హత్య తర్వాత దుండగులు అక్కడి నుంచి వేగంగా తప్పించుకుని వెళ్లిపోయారు. ఈ దృశ్యాల ఆధారంగా 30 సెకన్ల నిడివిలో హంతకులు దారుణానికి ఒడిగట్టి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు పోలీసులు గుర్తించారు.
కాగా, కార్పొరేటర్ హత్యకు సంబంధించి డి. జేబాకుమార్, ఆర్. రాజేష్, హెచ్. రాజీవ్, యు. ప్రభు, కుమార్ అలియాస్ కుమారవేలు అనే ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఓ సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. అయితే, వీరు అతడ్ని ఎందుకు చంపారో తెలియరాలేదని చెప్పారు. జేబాకుమార్ ఈ హత్యకు ప్రధాన సూత్రధారి అని ఆయన తెలిపారు. కాగా, అదుపులోకి తీసుకున్న ఐదుగురు నిందితుల విచారణలో హత్యకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.
మాధవరం రౌడీపై అనుమానం
జ్ఞానశేఖర్కు మాధవరంలో పేరుమోసిన ఓ రౌడీకి మధ్య పాతకక్షలు ఉన్నాయనే విషయం పోలీసుల దర్యాప్తులో వెలుగుచూసింది. ఏడాదిన్నర క్రితం ఆ రౌడీతో జ్ఞానశేఖర్ కుటుంబంలోని ఒకరు గొడవపడ్డారని, ఈ సందర్భంగా అతణ్ని జ్ఞానశేఖర్ కొట్టాడని తెలిసింది. ఆ కక్షతో సదరు రౌడీ ఈ హత్యకు పూనుకున్నాడా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.