అన్నదాతపై కన్నెర్ర: తూటాలకు బలైన రైతులు.. మధ్యప్రదేశ్లో తీవ్ర హింసాత్మకం..
రగబడ్డ రైతులు వారిపైకి రాళ్లు రువ్వారు. ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణపూరిత వాతావరణం నెలకొనగా.. సీఆర్పీఎఫ్ సిబ్బంది, పోలీసులు కాల్పులకు దిగారు. దీంతో ఐదుగురు రైతులు ప్రాణాలు కోల్పోయారు.
భోపాల్: దేశవ్యాప్తంగా రైతులు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధరలేక రోడ్డెక్కుతున్నారు. పట్టించుకోవాల్సిన ప్రభుత్వాలు రైతుల మీద లాఠీచార్జీలు చేయిస్తుండటం శోచనీయం. తాజాగా మధ్యప్రదేశ్ లో రైతన్నల దీక్షపై ప్రభుత్వం కన్నెర్ర చేసింది.
రైతుల ఆందోళన తీవ్ర ఉద్రిక్తం, కాల్పుల్లో నలుగురు రైతులు మృతి, పోలీసుల రివర్స్ గేర్
శాంతియుతంగా నిరసన చేస్తున్న రైతులపై పోలీసులు లాఠీచార్జీ చేయడం పరిస్థితి హింసాత్మకంగా మారింది. శాంతియుతంగా నిరసన చేసే హక్కు కూడా తమకు లేదా? అని ప్రశ్నిస్తూ పలువురు రైతులు.. వాహనాలకు నిప్పు పెట్టారు. రైల్వే ట్రాక్ లు, క్రాసింగ్ గేట్లను ధ్వంసం చేశారు.
ఐదుగురు రైతుల మృతి
రైతుల నిరసనపై విరుచుకుపడిన పోలీసులు.. వారిపై విచక్షణారహితంగా లాఠీచార్జీ చేసినట్లు తెలుస్తోంది. దీంతో తిరగబడ్డ రైతులు వారిపైకి రాళ్లు రువ్వారు. ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణపూరిత వాతావరణం నెలకొనగా.. సీఆర్పీఎఫ్ సిబ్బంది, పోలీసులు కాల్పులకు దిగారు. దీంతో ఐదుగురు రైతులు ప్రాణాలు కోల్పోయారు. పలువురు రైతులకు తీవ్ర గాయాలయ్యాయి. రైతులకు పోలీసులకు మధ్య ఘర్షణతో మంద్ సౌర్, పిప్లియా ప్రాంతాల్లో ఇంకా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.
కర్ఫ్యూ, ఇంటర్నెట్ రద్దు:
రైతులపై కాల్పులకు దిగిన పోలీసులు మంద్సౌర్, పిపల్యా మండీ తదితర ప్రభావిత ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. ఇంటర్నెట్ సేవలను కూడా రద్దు చేశారు. రట్లామ్, సువ్ సరా తదితర ప్రాంతాల్లో అన్నదాతల ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో.. మరింత ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. పబ్లిక్ ఆస్తులను ధ్వంసం చేయడంతో పోలీసులు వారిపై టియర్ గ్యాస్ ప్రయోగించారు.
సంఘవిద్రోహుల పనే:
రైతుల కాల్పుల ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్.. ఘటనపై విచారణకు ఆదేశించారు. రైతుల శాంతియుత నిరసనలో సంఘవిద్రోహక శక్తులు చొరబడ్డాయని ఆరోపించారు. పోలీసులు కాల్పులకు సంఘవిద్రోహకుల చర్యలే కారణమన్నారు. కాల్పుల్లో మరణించిన అన్నదాతలకు ఒక్కో కుటుంబానికి రూ.కోటి పరిహారం ప్రకటించారు. అలాగే ఇంటికో ఉద్యోగం ఇస్తామని హామి ఇచ్చారు. గాయపడ్డవారికి తక్షణ చికిత్స నిమిత్తం రూ.5లక్షలు ఇస్తామన్నారు.
మహారాష్ట్రలో రైతుల పరిస్థితి ఇది:
గిట్టుబాటు ధర కోసం మహారాష్ట్ర రైతులు చేస్తున్న సమ్మె ఆరో రోజుకు చేరుకుంది. దీంతో రాష్ట్రంలో నిత్యావసర సరుకులు, కూరగాయలకు తీవ్ర కొరత ఏర్పడింది. సప్లై పూర్తిగా తగ్గిపోవడంతో ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ మధ్యప్రదేశ్, మహారాష్ట్ర అన్నదాతలను పరామర్శించనున్నారు. బీజేపీ ప్రభుత్వం వారిపై కక్ష కట్టిందని ఆయన ఆరోపిస్తున్నారు. అన్నం పెట్టే రైతులకు బుల్లెట్ల తినిపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.