అయోధ్య కేసు విచారణ ఈ నెల 26న
న్యూఢిల్లీ: అత్యంత కీలకమైన అయోధ్యలో రామమందిర నిర్మాణానికి సంబంధించిన కేసు విచారణ ఈ నెల 26వ తేదీన సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. దీనిపై విచారణ చేపట్టడానికి ఏర్పాటైన అయిదు మంది న్యాయమూర్తుల్లో ఒకరైన జస్టిస్ ఎస్ ఎ బొబ్డె సెలవుల్లో ఉన్న కారణంగా ఈ కేసు విచారణను 26న చేపట్టనుంది. నిజానికి- అయోధ్య అంశంపై కిందటి నెల 29వ తేదీ నాడే సుప్రీంకోర్టు విచారణ చేపట్టాల్సి ఉండగా.. జస్టిస్ బొబ్డె గైర్హాజర్ కారణంగా వాయిదా వేశారు.
అయోధ్యపై దాఖలైన పిటీషన్ ను విచారించడానికి సుప్రీంకోర్టు అయిదు మంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇందులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్, న్యాయమూర్తులు జస్టిస్ ఎస్ ఎ బొబ్డె, డీవై చంద్రచూడ్, అశోక్ భూషణ్, ఎస్ అబ్దుల్ నజీర్ ఈ బెంచ్ లో ఉన్నారు. రామజన్మభూమిపై 2010 సెప్టెంబర్ 30వ తేదీన అలహాబాద్ హైకోర్టు వెలువడించిన తీర్పుపై దాఖలైన పిటీషన్లను ఈ బెంచ్ విచారిస్తోంది.
కాగా, అయోధ్య సమస్యను పరిష్కరించడానికి అలహాబాద్ హైకోర్టు మూడు మార్గాలను సూచిస్తూ, తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. 2.77 ఎకరాల రామ జన్మభూమి-బాబ్రీ మసీదు స్థలాన్ని నిర్మోహీ అఖారా, సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు, రామ్ లల్లా లకు కేటాయిస్తూ తీర్పు ఇచ్చింది. దీన్ని సవాలు చేస్తూ పలువురు సుప్రీంకోర్టులో పిటీషన్లు దాఖలు చేశారు.
అయోధ్యలో మొత్తం భూమి 67.703 ఎకరాలుగా ఉందని, దీని వాటా తేల్చాలని అంటూ లక్నోకు చెందిన ఏడుమంది సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. రాష్ట్ర పరిధిలో ఉన్న భూమిని స్వాధీన పరచుకునే అధికారం కేంద్రానికి లేదని వారు పిటీషన్ లో పేర్కొన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో కౌంటర్ పిటీషన్ దాఖలు చేసింది. అయోధ్యలో వివాదాస్పదమైన 67 ఎకరాలను స్వాధీనం చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరుతూ కిందటి నెల 29న పిటీషన్ వేసింది.