12 రోజుల తర్వాత చెర వీడిన ఐదేళ్ల బాలుడు: ఒకరి హతం
న్యూఢిల్లీ: కిడ్నాపర్ల చెర నుంచి ఐదేళ్ల బాలుడు 12 రోజుల తర్వాత బయటపడ్డాడు. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అతన్ని విజయవంతంగా కిడ్నాపర్ల నుంచి రక్షించారు. ఢిల్లీలో జనవరి 25వ తేదీన బాలుడిని పాఠశాల బస్సును అపేసి కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే.
పోలీసులు చేపట్టిన ఆపరేషన్లో కిడ్నాపర్లలో ఒకతను హతమైనట్లు తెలుస్తోంది. మరొకతను గాయపడ్డాడు. గాయపడిన కిడ్నాపర్ ఢిల్లీలోని జిటిబి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
జనవరి 25వ తేదీన బాలుడు తన సోదరితో కలిసి బస్సులో పాఠశాలకు వెళ్తుండగా ఢిల్లీలోని దిల్షాద్ గార్డెన్ ఏరియాలో బైక్పై వచ్చిన వ్యక్తులు బాలుడిని కిడ్నాప్ చేశారు. బస్సు డ్రైవర్పై కిడ్నాపర్లు కాల్పులు కూడా జరిపారు.
తమకు 60 లక్షల రూపాయలు ఇస్తే బాలుడిని వదిలేస్తామని కిడ్నాపర్లు కుటుంబ సభ్యులకు జనవరి 28వ తేదీన ఫోన్ చేసి చెప్ారు. కాల్ వివరాల ఆధారంగా పోలీసులు కిడ్నాపర్లు ఉన్న చోటును గుర్తించారు. దాదాపు 12 రోజుల ప్రయత్నం తర్వాత బాలుడిని పోలీసులు రక్షించగలిగారు.
సాహిబాబాద్ ప్రాంతంలోని ఓ అపార్టుమెంటు ఫ్లాట్లో కిడ్నాపర్లు బాలుడిని ఉంచారు. సోమవారం ఉదయం కిడ్నాపర్లు అక్కడికి చేరుకన్నట్లు తెలుస్తోంది. సంఘటనా స్థలానికి తాము చేరుకోగానే కిడ్నాపర్లు కాల్పులు ప్రారంభించారని, తాము ఎదురు కాల్పులు జరిపామని, ఈ ఎదురు కాల్పుల్లో రవి అనే అతను మరణించాడని, పంకజ్ తీవ్రంగా గాయపడ్డాడని పోలీసులు తెలిపారుర.
ఓ పోలీసుకు కూడా బుల్లెట్ తగిలింది. అయితే, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించడంతో అతను గాయపడలేదు. బాలుడిని రక్షించి పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు.