చైనా మరో దురాగతం: ఇనుప రాడ్లు, బరిసెలతో భారత్ శిబిరంపై దాడికి - ముఖ్పారి పర్వతంపై ఘటన
భారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. నాలుగు దశాబ్దాల తర్వాత తొలిసారి తూటాలు పేలిన ఘటన మరువకముందే.. డ్రాగన్ మరో దురాగతం వెలుగులోకి వచ్చింది. తూర్పు లదాక్ లోని పాంగాంగ్ సరస్సుకు దక్షిణంగా ఉండే పర్వత శ్రేణులపై కన్నేసిన చైనా.. గడిచిన నాలుగు రోజులుగా అదే పనిగా కవ్విపులకు దిగుతూ, దాడుకుల యత్నిస్తున్నది. ఈ క్రమంలోనే ముఖ్పారి పర్వతంపై సోమవారం సాయంత్రం అనూహ్య సంఘటన చోటుచేసుకుంది.

గాల్వాన్ దాడి తరహాలో..
జూన్ 15న గాల్వాన్ లోయలోని 14వ పెట్రోలింగ్ పాయింట్ వద్ద భారత జవాన్లు 20 మందిని చంపేసిన తరహాలోనే చైనా సైన్యం తాజాగా మక్పరీ పర్వతంపైనున్న భారత శిబిరంపైకి దాడికి యత్నించింది. నాటి ఘటనలో ఉపయోగించిన ఇనుప రాడ్లు, ముళ్లకంచె చుట్టిన దుడ్డుకర్రలు, బరిసెలతోనే చైనా మళ్లీ బరితెగించింది. సోమవారం రాత్రి కాల్పులు చోటుచేసుకున్న రేజంగ్ లా హైట్స్ ను ఆనుకుని ఉండే ముఖ్పారి పర్వతంపైనే ఈ దురాక్రమణ యత్నం జరిగినట్లు భారత సైన్యంలోని విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి.

10-15 రౌండ్ల కాల్పులు?
పాంగాంగ్ సరస్సుకు ఉత్తరంగా ఉండే ఫింగర్ పాయింట్స్ వద్ద చైనా ఎత్తుగడలన్నీ చిత్తు కావడంతో అది సరస్సుకు దక్షిణంగా ఉండే పర్వతశ్రేణులపై కన్నేసింది. భారత భూభాగంలోని రేజంగ్ లా హైట్స్, ముఖ్పారి, గురుంగ్ పర్వతాలపై సరిహద్దులను చెరిపేసి, వాటిని ఆక్రమించుకునేందుకు డ్రాగన్ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే రేజంగ్ లా వద్ద సోమవారం కాల్పులు చోటుచేసుకున్నాయి. తొలు చైనా సైనికులు కాల్పులు జరపగా, మనోళ్లు ఎదురుకాల్పులు జరిపినట్లు భారత సైన్యం మంగళవారం ప్రకటించగా, ముందు ఇండియానే కాల్పులు జరిపిందని చైనా బుకాయించింది. అంతలోనే ముఖ్పారి పర్వతం వద్ద కూడా దాడికి యత్నం, కాల్పులు చోటుచేసుకున్నట్లు వెల్లడైంది. భారత జవాన్లు అడ్డుకోవడంతో చైనా బలగాలు కాల్పులకు దిగుతున్నాయి. రేజంగ్ లా హైట్స్ తోపాటు ముఖ్పారి వద్ద కూడా 10 నుంచి 15 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది.

వ్యూహాత్మక పాయింట్లపై భారత్ పట్టు..
చైనాతో గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని భారత్ అప్రమత్తంగా వ్యవహరిస్తున్నది. తూర్పు లదాక్ లో చైనా భారీ ఎత్తున బలగాలను మోహరించడంతో మే మొదటి వారం నుంచి ఉద్రిక్తతలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నాలుగు నెలల కాలంలో గాల్వాన్ ఘర్షణ, బలగాల ఉపసంహరింపు అంశాల్లో చైనా మోసకారి విధానాలను అవలంభించింది. ఆ దేశానికి మరో ఛాన్స్ ఇవ్వకూడదనే ఉద్దేశంతో పాంగాంగ్ సరస్సుకు దక్షిణంగా ఉండే వ్యూహాత్మక పాయింట్లపై భారత్ పట్టుబిగించింది. సైనికపరంగా అత్యంత కీలకమైన, ఎత్తైన శిఖరాలపై రేజంగ్ లా హైట్స్, ముఖ్పారి, గురుంగ్ పర్వతాలపై నుంచి భారత జవాన్లను వెళ్లగొట్టేందుకు చైనా కుట్రలు పన్నుతోంది. అందులో భాగంగనే కాల్పులు జరుపుతూ, ఇనుపరాడ్లు, బరిసెలతో భారత పోస్టులపైకి దూసుకొస్తూ హంగామా సృష్టిస్తోంది.












Click it and Unblock the Notifications