నెలరోజుల్లోనే 51% కరోనా కేసుల పెరుగుదల: తాజా పరిస్థితి చెప్పిన ప్రపంచ ఆరోగ్య సంస్థ!!
మళ్లీ భారతదేశాన్ని కరోనా మహమ్మారి వణికిస్తోంది. కరోనా వైరస్ కొత్త వేరియంట్ జేఎన్ 1 వ్యాప్తిపై దేశవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. తాజాగా కరోనా కేసుల సంఖ్య 3000 దాటింది. గణాంకాల ప్రకారం 423 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 3420 కి చేరింది. దేశవ్యాప్తంగా మొత్తం 17 రాష్ట్రాలలో మళ్ళీ కరోనా కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి.
ఇదిలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి మళ్ళీ పంజా విసురుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తుంది. కేవలం నెలరోజుల వ్యవధిలో కేసుల సంఖ్య 52 శాతానికి పెరిగిందని ఆరోగ్య సంస్థ వెల్లడించింది. జేఎన్ 1 వైరస్ త్వరగా వ్యాప్తి చెందుతుందని పేర్కొంది. నెల రోజుల్లో కరోనా కేసులు భారీగా పెరిగాయని పేర్కొన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ, నెలరోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 8.50 లక్షల కేసులు నమోదయ్యాయని వెల్లడించింది.

వీరిలో 1.18 లక్షల మంది ఆసుపత్రుల్లో చేరారని తెలిపింది. 3 వేల మందికి పైగా ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయారని వెల్లడించింది. మరో 1,600 మందికి పైగా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలిపింది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా కరోనా సోకిన వారి సంఖ్య 77 కోట్లు దాటగా, 70 లక్షల మంది మరణించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.
కరోనా కేసుల పెరుగుదల నేపధ్యంలో కరోనాను కట్టడి చెయ్యకుంటే కేసులు బాగా పెరుగుతాయని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ వేరియంట్ తో పెద్దగా జనాలకు ముప్పు లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటన చేసినప్పటికీ కరోనా కేసులు పెరుగుతున్నందున అందరూ జాగ్రత్తలు వహించాలని సూచించింది.
బహిరంగ ప్రదేశాలకు వెళ్లేటప్పుడు మాస్కులు ధరించాలని, భౌతికదూరం పాటించాలని, మళ్లీ కరోనా నిబంధనలు అందరూ పాటించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. జేఎన్1 వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గా అభివర్ణించిన క్రమంలో అప్రమత్తంగా ఉండాలన్న విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది.












Click it and Unblock the Notifications