జమ్మూకశ్మీర్లో 56 మంది విదేశీ ఉగ్రవాదులు .. పాకిస్థాన్ మూలాలున్న లష్కరే ముఠా ఆధిపత్యం!
భూతల స్వర్గంగా పేరొందిన కశ్మీర్ లోయ... అందమైన లోయలు, నిర్మలమైన సరస్సులు, మంచు దుప్పట్లు కప్పుకున్న పర్వత శ్రేణులతో పర్యాటకులను ఎప్పుడూ తనవైపు ఆకర్షిస్తూ ఉంటుంది. కొంతకాలంగా కశ్మీర్లో నెలకొన్న శాంతియుత వాతావరణంతో పర్యాటకుల తాకిడి గణనీయంగా పెరిగింది. ఎంతో మంది పర్యాటకులు కశ్మీర్ అందాలను ఆస్వాదించేందుకు తరలివస్తున్నారు. అయితే, ఈ ప్రశాంతతను భగ్నం చేస్తూ ఉగ్రవాదులు మరోసారి తమ పడగ విప్పారు. పర్యాటకుల సందడి ఎక్కువగా ఉన్న సమయంలోనే ఒక దారుణమైన దాడికి తెగబడి, యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేశారు.
పర్యాటకులపై ఉగ్రదాడి
మినీ స్విట్జర్లాండ్గా పిలువబడే పహల్గాం సమీపంలోని బైసరన్ లోయ మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో రక్తసిక్తమైంది. సైనికుల దుస్తుల్లో వచ్చిన ముష్కరులు.. ఎలాంటి అనుమానానికి తావులేకుండా పర్యాటకులపై అతి సమీపం నుంచి కాల్పులు జరిపారు. ఈ పాశవిక దాడిలో 26 మంది అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఊహించని ఈ దాడితో పర్యాటకులు, స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. దాడి అనంతరం ఉగ్రవాదులు సమీపంలోని దట్టమైన అడవుల్లోకి పారిపోయారు.

పాకిస్థాన్ కేంద్రంగా కార్యకలాపాలు
ఈ దాడి వెనుక పాకిస్థాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న లష్కరే తయ్యిబా అనుబంధ విభాగమైన 'ద రెసిస్టెన్స్ ఫ్రంట్' (TRF) ఉందని భద్రతా సంస్థలు ప్రాథమికంగా నిర్ధారించాయి. పర్యాటక రంగాన్ని దెబ్బతీయడం, కశ్మీర్లో శాంతి నెలకొంటుందనే ఆశలను అడియాశలు చేయడమే ఈ దారుణానికి పాల్పడటం వెనుక ప్రధాన ఉద్దేశ్యమని భద్రతా దళాలు భావిస్తున్నాయి. ఘటన జరిగిన వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు అడవుల్లోకి పారిపోయిన ఉగ్రవాదుల కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టాయి. జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టింది. ఈ దాడిలో పాల్గొన్న ముగ్గురు కీలక ఉగ్రవాదులు ఆసిఫ్ ఫౌజి, సులేమాన్ షా, అబు తాలాగా అనుమానిస్తూ.. వారి ఊహాచిత్రాలను దర్యాప్తు బృందాలు విడుదల చేశాయి.
జమ్ముకశ్మీర్లో విదేశి ఉగ్రవాదులు
పహల్గాం దాడి తీవ్రత దృష్ట్యా దేశ రాజధాని దిల్లీలో కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇదిలా ఉండగా, ఈ భయానక దాడి నేపథ్యంలో జమ్మూకశ్మీర్లో ఉన్న ఉగ్రవాదుల సంఖ్య, ముఖ్యంగా విదేశీ ముష్కరుల ఉనికిపై భద్రతా సంస్థలు కీలక వివరాలను వెల్లడించాయి. భద్రతా దళాల వద్ద ఉన్న రికార్డుల ప్రకారం.. ప్రస్తుతం జమ్మూకశ్మీర్లో మొత్తం 56 మంది విదేశీ ఉగ్రవాదులు సంచరిస్తున్నారు. వీరిలో అత్యధికంగా పాకిస్థాన్ మూలాలున్న లష్కరే తయ్యిబా ముఠాకు చెందిన వారే ఉన్నారు. 35 మంది లష్కరే సభ్యులు కాగా, 18 మంది జైషే మహమ్మద్, ముగ్గురు హిజ్బుల్ ముజాహిద్దీన్కు చెందిన వారని భద్రతా సంస్థలు పేర్కొన్నాయి. వీరితో పాటు కేవలం 17 మంది మాత్రమే స్థానిక ఉగ్రవాదులు ఉన్నారని, వారి సంఖ్య విదేశీ ఉగ్రవాదులతో పోలిస్తే చాలా తక్కువని తెలిపాయి.
కశ్మీర్లో అశాంతికి కుట్ర
విదేశీ ఉగ్రవాదుల సంఖ్య స్థానిక ఉగ్రవాదుల కంటే అధికంగా ఉండటం భద్రతా సంస్థలకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. పాకిస్థాన్ నుంచి చొరబాట్లను పెంచడానికీ, కశ్మీర్లో అశాంతిని రెచ్చగొట్టడానికీ ఇది స్పష్టమైన సంకేతమని భద్రతా అధికారులు అంటున్నారు. పహల్గాం వంటి దాడులు ఈ విదేశీ ముష్కరుల పనేనని, వారి ఉనికి కశ్మీర్ లోయలో శాంతి స్థాపనకు పెనుసవాలుగా మారిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించేంత వరకు భద్రతా బలగాల పోరాటం కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు. పర్యాటకులపై జరిగిన ఈ దాడి... కశ్మీర్లో ఉగ్రవాద నిరోధక చర్యలను మరింత ముమ్మరం చేయాల్సిన అవసరాన్ని మరోసారి తెలియజేసింది.












Click it and Unblock the Notifications